న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఈ నెలలో 250 మందికిపైగా సిబ్బందిని తొలగించాలని ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్, డెలివరీ వేదిక స్విగ్గీ చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఇది సంస్థ ఉద్యోగుల్లో 5 శాతం వరకు సమానం. ‘ఇప్పటిదాకా ఎవర్నీ తొలగించలేదు. అక్టోబర్లో మా ఉద్యోగుల పనితీరుకు సంబంధించి అన్ని స్థాయిల్లో రేటింగ్స్, ప్రమోషన్ల ప్రకటన జరిగింది.
ఉద్యోగుల ప్రదర్శన ఆధారంగానే వారిపై వేటు వేయాలా?.. వద్దా?.. అనేది ఉంటుం ది. ఇది ప్రతిసారీ జరిగేదే’ అని ఓ ప్రకటన లో స్విగ్గీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. కాగా, వ్యయ నియంత్రణలో భాగంగానే సంస్థ.. ఉద్యోగుల తొలగింపుల దిశగా అడుగులు వేస్తున్నదని సమాచారం. భారీ ఆఫర్లు ఇస్తున్నా మార్కెట్లో స్విగ్గీ ఆదరణ కోల్పోతున్నదన్న వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం స్విగ్గీ ఏకీకృత నష్టం రూ.1,616.9 కోట్లుగా ఉన్నది.