SUV Cars | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకే మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేకించి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) కార్లపై మోజు పెంచేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు తమ కారులో 300-500 కి.మీ హాయిగా ప్రయాణం చేయాలని కోరుకుంటున్నారు. అందుకు అనువుగా ఉన్న ఎస్యూవీ కార్లపై మనస్సు పారేసుకుంటున్నారు. 2022లో కార్ల సేల్స్లో ఎస్యూవీలదే ప్రధాన వాటా. ప్రతి ఐదు కార్లలో రెండు ఎస్యూవీ కార్లు అమ్ముడయ్యాయంటే వాటి పట్ల యూజర్లలో ఎంత క్రేజ్ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. 2023లోనూ ఎస్యూవీ కార్ల సేల్స్ మరింత పెరుగుతాయని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. గత నెలలో దేశవ్యాప్తంగా యుటిలిటీ వెహికల్స్ సేల్స్ రికార్డు స్థాయిలో పెరిగాయి.
టాప్-5 కంపెనీల ఎస్యూవీ కార్ల సేల్స్ సగటున 42 శాతం పెరిగాయి. టయోటా ఎస్యూవీ కార్లు 75 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్యూవీ కార్లు 66 శాతం పెరిగాయి. ఇక మార్కెట్ లీడర్ మారుతి సుజుకి ఎస్యూవీ సేల్స్ 33 శాతం వృద్ధి చెందితే, టాటా మోటార్స్ 18 శాతం, హ్యుండాయ్ ఎస్యూవీ కార్ల సేల్స్ 14 శాతం వాటా పొందాయి.
ఒకవైపు ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నా.. దేశంలో పెద్ద కార్ల సేల్స్ కూడా రోజురోజుకు పుంజుకుంటున్నాయి. శరవేగంగా పెద్ద కార్లకు.. అందునా ఎస్యూవీ కార్లకు గిరాకీ పెరుగుతున్నది. 2008-09 తర్వాత పదేండ్ల పాటు మారుతి జెన్, హ్యుండాయ్ ఐ20, హోండా జాజ్ తదితర బీ-సెగ్మెంట్ కార్లకు గిరాకీ ఉంది. కానీ, కరోనా తర్వాత ఎస్యూవీ.. అందునా కంపాక్ట్ ఎస్యూవీలపై యూజర్లు క్రేజ్ పెంచుకుంటున్నారన్నారు ఆటోమొబైల్ నిపుణులు. ఈ నేపథ్యంలోనే దాదాపు ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఆకర్షణీయ ఫీచర్లతో ఎస్యూవీ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.. తీసుకొస్తున్నాయి.