Car Sales | కొవిడ్-19 మహమ్మారి తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకు అనుగుణంగా గత నెలలో భారత్లో కార్ల విక్రయాల్లో చెప్పుకోదగ్గ ప్రగతి కనిపిస్తున్నది. జూలైలో దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సేల్స్లో 8.28 శాతం గ్రోత్ నమోదైతే.. టాటా మోటార్స్ 51.12 శాతం వృద్ధి నమోదు చేసింది. మారుతి సుజుకి కార్ల విక్రయాలు 8.28 శాతం రూ. 1,75,916 యూనిట్లకు పెరిగాయి. 2021 జూలైలో 1,62,462 కార్లు విక్రయించింది. దేశీయ కార్ల విక్రయాలు 6.82 శాతం వృద్ధితో 1,42,850 యూనిట్లకు చేరాయి. గతేడాది జూలైలో దేశీయంగా 1,33,732 కార్లు మాత్రమే మారుతి సుజుకి విక్రయించింది.
దేశీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ అద్భుతమైన ప్రగతి నమోదు చేసింది. 2021 జూలైతో పోలిస్తే గత నెలలో టాటా మోటార్స్ విక్రయాలు 51.12 శాతం పెరిగి 81,790 యూనిట్లకు చేరాయి. దేశీయ మార్కెట్లో కార్లకు గట్టి డిమాండ్ ఉందని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 2021 జూలైలో దేశీయంగా, అంతర్జాతీయంగా 54,119 కార్లు మాత్రమే విక్రయించింది. గతేడాదిలో 54,119 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. దేశీయంగా గత నెలలో 78,978 (52 శాతం) వాహనాలు విక్రయిస్తే, గతేడాది జూలైలో 51,981 కార్లు మాత్రమే అమ్మగలిగింది.
టాటా మోటార్స్తోపాటు మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల విక్రయాలు 33 శాతం పెరిగాయి. 2021తో పోలిస్తే కార్ల విక్రయాలు 33 శాతం పెరిగి 28,053 యూనిట్లకు చేరాయి. 2021 జూలైలో 21,046 కార్లు మాత్రమే విక్రయించింది. దేశీయ యుటిలిటీ వెహికల్స్ సేల్స్ 34 శాతం వృద్ధితో 27,854 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది 20,797 యూనిట్లకు పరిమితం అయ్యాయి. అయితే, కార్స్ అండ్ వ్యాన్స్ సేల్స్ 20 శాతం తగ్గి 249 నుంచి 199 యూనిట్లతో సరిపెట్టుకున్నది.
దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్స్ సేల్స్ ఆరు శాతం పెరిగాయి. గతేడాది (2021) జూలైలో 60,249 కార్లను విక్రయించిన హ్యుండాయ్.. గత నెలలో 63,851 యూనిట్లు విక్రయించింది. దేశీయ మార్కెట్లో 5.1 శాతం వృద్ధితో 50,500 కార్లు విక్రయిస్తే.. గతేడాది జూలైలో 48,042 కార్లు మాత్రమే అమ్మగలిగింది. గత నెలలో విదేశాలకు కార్ల ఎగుమతిలో 9.4 శాతం (13,351 యూనిట్లు) గ్రోత్ నమోదు చేసింది.
టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం) గత నెలలో 19,693 కార్లు విక్రయించింది. గతంలో ఏ నెలతో పోల్చుకున్నా ఇది గరిష్ఠం అని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది జూలైతో పోలిస్తే టయోటా కార్ల సేల్స్ 50 శాతానికి పైగా పెరిగాయి. గతేడాది జూలైలో 13,105 కార్లు మాత్రమే విక్రయించింది.
కానీ ఎంజీ మోటార్ ఇండియా కార్ల విక్రయాలు ఐదు శాతం తగ్గాయి. గత నెలలో 4,013 కార్లు మాత్రమే సేల్ అయ్యాయి. సప్లయ్ చైన్లో ఇబ్బందులు కార్ల ఉత్పత్తిపై ప్రభావం చూపిందని ఎంజీ మోటార్ ఇండియా తెలిపింది. గతేడాది జూలైలో 4,225 కార్లు విక్రయించింది.
ఇదిలా ఉంటే బజాజ్ టూ వీలర్స్ సేల్స్ ఐదు శాతం తగ్గాయి. గతేడాది 3,30,569 టూ వీలర్స్ విక్రయిస్తే, గత నెలలో 3,15,054 యూనిట్లకే పరిమితమైంది. దేశీయంగా మాత్రం టూ వీలర్స్ విక్రయాలు ఐదు శాతం పెరిగాయి. గతేడాది దేశంలో 1,56,232 యూనిట్లు విక్రయిస్తే, గత నెలలో 1,64,384 యూనిట్లకు చేరాయి. విదేశాలకు బైక్స్, స్కూటర్ల ఎగుమతి 14 శాతం తగ్గి 1,50,670 యూనిట్లకు పరిమితం అయ్యాయి.