న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లకు సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘించారన్న అభియోగంపై తమపై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్రాధమిక దర్యాప్తు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ ఫ్లిప్కార్ట్, అమెజాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ను విచారించడానికి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్లు వినీత్ శరణ్, సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
క్రిమినల్ లా కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు తమకు నోటీసులు జారీ చేయాలన్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ యాజమాన్యాలు తమకు తాముగా దర్యాప్తు చేపట్టిన సీసీఐకి నివేదికలు సమర్పించాలని సూచించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు తమకు తాముగా విచారణ జరుపాలని కోరతాయని తాము అంచనా వేస్తున్నామని, అలా కానీ పక్షంలో ఆ సంస్థలు సీసీఐకి నివేదికలు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది.
సీసీఐకి నివేదిక సమర్పించడానికి గడువు సోమవారంతో ముగిసిందని ఫ్లిప్కార్ట్ తరపున విచారణకు హాజరైన ఏఎం సింఘ్వీ.. కోర్టు ద్రుష్టికి తెచ్చారు. దీంతో మరో నాలుగు వారాల సమయం పొడిగిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. సీసీఐ తరుపున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. ఈ-కామర్స్ దిగ్గజాలకు గడువు పొడిగించడాన్ని వ్యతిరేకించారు. వారం రోజులు గడువు చాలునని వాదించారు.
కాంపిటిషన్ చట్టాలను అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు ఉల్లంఘిస్తున్నాయంటూ ఢిల్లీ వ్యాపార్ మహాసంఘ్ గతేడాది జనవరిలో సీసీఐకి ఫిర్యాదు చేసింది. దీన్ని కర్ణాటక హైకోర్టులో రెండు ఈ కామర్స్ సంస్థలు సవాల్ చేశాయి. రెండు సంస్థల పిటిషన్లపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు.. ప్రస్తుత దశలో సీసీఐ విచారణను నిలిపివేయలేమని ఇటీవల తీర్పు చెప్పింది.