Maruti on Chips Shortage | చిప్లు, సెమీ కండక్టర్ల కొరత కార్ల పరిశ్రమను వెంటాడుతున్నది. వాటి సరఫరాలో వెంటాడుతున్న తీవ్ర జాప్యంతో డిమాండ్కు అనుగుణంగా కార్ల ఉత్పత్తి సాధించలేకపోతున్నామని దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. మార్కెట్లో డిమాండ్ బాగానే ఉన్నదని, బుకింగ్స్ కూడా మెరుగ్గా ఉన్నాయన్నారు. కార్ల లభ్యత సమస్యగా మారడంతో కస్టమర్లు తాము బుక్ చేసుకున్న కార్ల కోసం గణనీయ కాలం వేచి ఉండాల్సి వస్తున్నదన్నారు.
ఇలా సుదీర్ఘ కాలం వెయిట్ చేయాల్సి వస్తే డిమాండ్పై ప్రతికూల ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన వ్యక్తం అవుతున్నదని శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. ఎప్పటికప్పుడు తమ ఖాతాదారులతో సంప్రదిస్తూ.. పరిస్థితిని వివరిస్తున్నట్లు చెప్పారు. చాలా వరకు కొత్త కార్ల కొనుగోలుదారులు కూడా పరిస్థితిని అర్థం చేసుకుంటూనే ఉన్నారన్నారు. కొన్ని మోడల్ కార్ల కోసం వారాల నుంచి నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నదన్నారు. ప్రస్తుతం మారుతి సుజుకి 2.5 లక్షల యూనిట్ల కార్ల డెలివరీ పెండింగ్లో ఉన్నది.