హైదరాబాద్, మే 16: అమెరికాకు చెందిన ఐటీ సంస్థ సునేరా టెక్నాలజీ..భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. వచ్చే మూడేండ్లకాలంలో టెక్నాలజీ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడానికి 100 మిలియన్ డాలర్లు(రూ.750 కోట్లకు పైమాటే) ఖర్చు చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. అలాగే ప్రస్తుతం కంపెనీలో 2,200 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా..వచ్చే 12 నుంచి 18 నెలలకాలంలో ఈ సంఖ్యను 3,500 నుంచి 3,800కి పెంచుకోవాలనుకుంటున్నది. నూతనంగా నియమించుకోనున్న సిబ్బందిలో వెయ్యి మందిని దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల నుంచి తీసుకోబోతుండగా, మరో 500 మందిని నూతనంగా, 200 మందిని తక్కువ ఆదాయ వనరులు కలిగిన కుటుంబాల నుంచి తీసుకోవాలనుకుంటున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి రవి రెడ్డి తెలిపారు. ఈ మొత్తం సిబ్బంది కేవలం హైదరాబాద్ ఆఫీస్ కోసం రిక్రూట్ చేసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.
హైదరాబాద్లో మూడో ఆఫీస్
కంపెనీ ఇటీవల హైదరాబాద్లో తన మూడో ఆఫీస్ను తెరిచింది. ఉప్పల్లో ఉన్న క్యాంపస్లోనే ఈ నూతన సెంటర్ను ఇటీవల ప్రారంభించింది. దేశీయ, ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగానికి పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ నూతన ఆఫీస్ను ప్రారంభించినట్లు రవి రెడ్డి చెప్పారు. అతిపెద్ద కంపెనీలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్లకు ఇన్నోవేషన్ సెంటర్లు ఉన్నాయని, కానీ మధ్య, చిన్న స్థాయి బిజినెస్ చేస్తున్న సంస్థలు సెంటర్లు ఏర్పాటు చేయడం చాలా కష్టంగా ఉంటుందని, ఇలాంటి సంస్థలకు టెక్నాలజీ సేవలు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.