Sundar Pichai | రోజురోజుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వాడకం పెరుగుతుండటంతో ఉద్యోగావకాశాల పట్ల టెక్ నిపుణుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, టెక్నాలజీ నిపుణుల భవితవ్యంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. టెక్నాలజీని లోతుగా అర్థం చేసుకుంటేనే టెక్ నిపుణులు పరివర్తన చెందగలరని, ఏదైనా సాధించగలరని తాను నమ్ముతానన్నారు. రోట్ లెర్నింగ్ (బట్టీ పట్టి చదవడం) కంటే ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకున్నప్పుడే విజయం సాధించగలమని తాను నమ్ముతానని అన్నారు. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఏ అంశాన్నైనా తెలుసుకోవచ్చునని, దాన్ని అర్థం చేసుకునే పద్దతిని పాటించాలని చెప్పారు.
ఏ అంశమైనా తెలుసుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి మధ్య వ్యత్యాసం వివరించేందుకు ‘త్రీ ఇడియట్స్’లోని ఓ సన్నివేశాన్ని సుందర్ పిచాయ్ గుర్తు చేశారు. ఒక తరగతి గదిలో టీచర్.. ‘మోటార్’ ఎలా పని చేస్తుందో నిర్వచనం ఇవ్వాలని విద్యార్థిని అడిగితే.. కంఠస్థం చేసిన నిర్వచనం ఇవ్వడానికి బదులు.. సాధారణ పదాలతో ‘యంత్రం’ అంటే ఏమిటో వివరిస్తాడని, విషయాన్ని గ్రహించడం అంటే ఇదేనన్నారు.
భారతీయ వంటకాలపై తన ఇష్టాయిష్టాలనూ సుందర్ పిచాయ్ బయట పెట్టారు. ప్రాంతాల వారీగా బెంగళూరులో ఉన్నప్పుడు తాను దోశె బాగా తినే వాడినని, ఢిల్లీలో చోలే బటూరై, ముంబైలో ‘పావ్ బాజ్’ అంటే చాలా ఇష్టం అని చెప్పారు.