న్యూఢిల్లీ, మే 30: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ. 2,277 కోట్ల నష్టాన్ని ప్రకటించింది సన్ ఫార్మా. ఒకేసారి అయాచిత నష్టాలు రావడంతో భారీగా నష్టాన్ని నమోదు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ముంబైకి చెందిన ఈ ఫార్మా సంస్థ అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.894 కోట్ల లాభాన్ని గడించింది. సమీక్షకాలంలో కన్సాలిడేటెడ్ విక్రయాలు రూ.8,464 కోట్ల నుంచి రూ.9,386 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.38,426 కోట్ల ఆదాయంపై రూ.3,273 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది.
ఈ సందర్భంగా సన్ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ మాట్లాడుతూ..గడిచిన ఆర్థిక సంవత్సరం సంస్థ అన్ని రంగాల్లో రాణించిందన్నారు. ఇతర మార్కెట్లతో పోలిస్తే దేశీయ వ్యాపారం శరవేగంగా పుంజుకుంటున్నదని, దీంతో మార్కెట్ వాటా మరింత పెరిగిందన్నారు. మరోవైపు గతేడాదికిగాను రూ.3 తుది డివిడెండ్ను కంపెనీ బోర్డు ప్రకటించింది.
దీంతో ఇప్పటికే ప్రకటించిన రూ.7 డివిడెండ్ కలుపుకొని మొత్తంగా రూ.10 డివిడెండ్ రూపంలో వాటాదారులకు చెల్లించినట్లు అయింది. అలాగే దిలీప్ సంఘీ మరో ఐదేండ్లపాటు ఎండీగా నియామకానికి బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయన ఏప్రిల్ 1, 2023 నుంచి మార్చి 31, 2028 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. కంపెనీ షేరు ధర 1.75 శాతం తగ్గి రూ.888.10 వద్ద నిలిచింది.