ACs & Fridges | ఎండాకాలం వస్తున్నది. వేసవిలో భానుడి కిరణాల ప్రభావానికి తోడు.. పర్యావరణం ప్రభావంతో వాతావరణం మరింత వేడెక్కుతున్నది. ఈ తరుణంలో వేసవిలో కాస్త సేద తీరాలంటే ఫ్యాన్లు మాత్రమే సరిపోవు. ఎయిర్ కండిషనర్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు కావాల్సిందే. వీటితోపాటు శీతల పానీయాలు, మిల్క్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ సేల్స్ ఈ నెలలో 10 శాతానికి పైగా సేల్స్ పెరిగాయి. కస్టమర్ల గిరాకీని బట్టి వాటి ధరలు 7-25 శాతం పెరిగాయి. మున్ముందు ఎయిర్ కండిషనర్లు, ఫ్రిడ్జ్లు, ఏసీల సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. కస్టమర్ల డిమాండ్ ప్రకారం కంపెనీలు ఉత్పత్తి పెంచేశాయి కూడా.
పశ్చిమ భారత ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణంగా ఫిబ్రవరిలో వాతావరణం పొడిగానే ఉంటుంది. తత్ఫలితంగా వేసవిలో సేద తీరడానికి ఉపకరించే ఏసీలు, కూలర్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఎల్జీ అనే కంపెనీ మూడు షిప్టుల్లో పని ప్రారంభించింది. గోద్రేజ్ అప్లియెన్సెస్, పనాసోనిక్ వంటి సంస్థలు కూడా ఏసీలు, ఫ్రిడ్జ్ల ఉత్పత్తి 100 శాతం పెంచేశాయి.
పెప్సికో వరల్డ్ వైడ్ ఫ్రాంచైసీ వరుణ్ బేవరేజెస్ గతేడాది డిసెంబర్ నుంచే ఉత్పత్తి పెంచేసింది. ఇప్పటికే ఆరు ప్లాంట్లు ఉంటే, కొత్తగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ల్లో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేసింది.
ధరలు పెరిగిపోయినా కన్జూమర్ డ్యూరబుల్స్కు డిమాండ్ తగ్గడం లేదని ఎల్జీ ఇండియా సీనియర్ జనరల్ మేనేజర్ కుల్భూషణ్ భరద్వాజ్ చెప్పారు. ఈ నెలలో 10 శాతానికి పైగా సేల్స్ పెరిగాయన్నారు. ఈ పరిస్థితుల్లో తాము ఉత్పత్తి పెంచేశామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కూలర్లు, ఏసీల వంటి కూలింగ్ పరికరాల కోసం దాదాపు 40 శాతం గిరాకీ పెరుగొచ్చని గోద్రేజ్ అప్లియెన్సెస్ బిజినెస్ హెడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ప్రెసిడెంట్ కమల్ నందీ తెలిపారు.
2022 ఏప్రిల్ నుంచి ఏసీలు, ఫ్రిజ్ల సేల్స్ 35 శాతం పెరిగాయని పనాసోనిక్ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎండీ పుమియాసు ఫుజిమోరి పేర్కొన్నారు. ఈ వేసవిలోనూ అదే గిరాకీ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గతేడాది సేల్స్తో పోలిస్తే ఈ ఏడాది మరింత పెరుగుతాయని కన్సల్టెన్సీ ఫర్మ్ రెడ్సీర్ తెలిపింది. హిందూస్థాన్ యూనీ లివర్, నెస్ట్లే, ఐటీసీ, స్పెన్సర్ రిటైల్ వంటి కంపెనీల డేటా ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంది.