Tax-Free Investments | ఇన్వెస్టర్లలో రెండు రకాలు.. కొందరు మదుపర్లు ఎక్కువ రిటర్న్స్ సాధించడానికి ఎల్లవేళలా రిస్క్ చేస్తుంటారు. మరికొందరు ఆచితూచి మెరుగైన లాభాలు ఇచ్చే పథకాల్లో పెట్టుబడులు పెట్టారు. ఆకర్షణీయ రిటర్న్స్ను దృష్టిలో పెట్టుకోకుండా సురక్షితమైన పెట్టుబడులు పెట్టాలని భావించే వారికి సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) తదితర ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులతో రిటర్న్స్ గ్యారంటీగా ఉంటాయి. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా ఈ పథకాలు నిర్వహిస్తారు. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద అన్ని పెట్టుబడి పథకాలు పన్ను మినహాయింపుకు అర్హం కావు. కొన్ని పథకాలేమిటో చూద్దాం.. !
సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) పథకంలో పెట్టుబడులు ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపుకు క్లయిమ్ చేయొచ్చు. గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకం కింద పెట్టుబడుల మెచ్యూరిటీ లేదా విత్ డ్రాయల్స్కు కూడా ఐటీ మినహాయింపు లభిస్తుంది.
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్) పథకంలో పెట్టే మొత్తం పెట్టుబడులపై పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. పీపీఎఫ్ కింద డిపాజిట్లు, వాటిపై వడ్డీ.. మెచ్యూరిటీ తర్వాత విత్ డ్రా చేసుకునే మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఫిక్సడ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం మీద ఆదాయం పన్ను చట్టానికి అనుగుణంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం రూ.40 వేలు (వృద్ధులైతే రూ.50 వేల వరకు) దాటితే బ్యాంకులు టీడీఎస్ కింద పన్ను మినహాయించుకుంటాయి. రూ.40 వేలు దాటిన ఆదాయంపై 10 శాతం పన్ను వసూలు చేస్తాయి. ఆదాయం పన్ను చట్టంలోని 15జీ (వృద్ధులకు 15 హెచ్ సెక్షన్) ఫామ్ కింద టీడీఎస్ నుంచి మినహాయింపు క్లయిం చేయొచ్చు.
రికరింగ్ డిపాజిట్లలో పెట్టుబడులపై వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపులు ఉండవు. వచ్చే వడ్డీ ఆదాయాన్ని బట్టి ఆదాయం పన్ను చట్టం అమలవుతుంది. రూ.40 వేల లోపు వడ్డీ వరకు పన్ను వర్తించదు. రూ.40 వేలు దాటిన వడ్డీ ఆదాయంపై 10 శాతం పన్ను కింద బ్యాంకులు టీడీఎస్ డిడక్ట్ చేసుకుంటాయి.