Sukanya Samriddhi Yojana | న్యూఢిల్లీ, డిసెంబర్ 29: చిన్న మొత్తాలపై కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. సుకన్య సమృద్ధి స్కీంపై వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్లు పెంచిన కేంద్ర సర్కార్..మూడేండ్ల కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్ స్కీంపై వడ్డీని 10 బేసిస్ పాయింట్లు సవరించింది. ఈ పెరిగిన వడ్డీరేట్లు జనవరి-మార్చి త్రైమాసికానికి వర్తించనున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యూలర్లో పేర్కొంది. దీంతో సుకన్య సమృద్ధి స్కీంపై వడ్డీరేటు 8 శాతం నుంచి 8.2 శాతానికి చేరుకున్నది. అలాగే మూడేండ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటు కూడా 7 శాతం నుంచి 7.10 శాతానికి చేరింది.
ప్రతి మూడు నెలలకొకసారి చిన్న మొత్తాలపై వడ్డీరేటును సవరిస్తున్న కేంద్రం..ఈసారి మాత్రం రెండు పథకాలపై వడ్డీరేట్లను సవరించింది. మిగతా స్కీంలపై వడ్డీని యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో ప్రజాదరణ పొందిన పీపీఎఫ్, పొదుపు డిపాజిట్లపై వడ్డీరేట్లు యథాతథంగా ఉన్నాయి. పీపీఎఫ్ రేటు 7.1 శాతంగాను, పొదుపు డిపాజిట్లపై వడ్డీరేటు 4 శాతం వద్ధ స్థిరంగా ఉన్నది. డిసెంబర్ త్రైమాసికంలోనూ ఇదే రేట్లు కొనసాగాయి. అలాగే 115 నెలల్లో మెచ్యూర్ అయ్యే కిసాన్ వికాస్ పత్రాలపై 7.5 శాతం వడ్డీరేటును, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్పై 7.7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. మంత్లీ ఇన్కం స్కీంపై 7.4 శాతం వడ్డీ ఇస్తున్నది.
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ బాటలోనే బీవోబీ కూడా డిపాజిట్లపై వడ్డీని 125 బేసిస్ పాయింట్ల వరకు సవరించింది. రూ.2 కోట్ల లోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్ల నుంచి 125 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు బీవోబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 7 రోజుల నుంచి 14 రోజుల లోపు కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 125 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీరేటు 3 శాతం నుంచి 4.25 శాతానికి చేరుకున్నది. అలాగే 15 రోజుల నుంచి 45 రోజుల్లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటు 100 బేసిస్ పాయింట్లు సవరించడంతో రేటు 4.50 శాతానికి చేరింది. స్వల్పకాలిక డిపాజిట్లు ముఖ్యంగా ఏడాది లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించినట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.