ముంబై, జనవరి 19: ప్రపంచ స్టాక్ మార్కెట్లు అతలాకుతలంకావడంతో దేశీ స్టాక్ సూచీలు వరుసగా రెండోరోజు కుదేలయ్యాయి. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 656 పాయింట్లు పతనమై 60,099 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 750 పాయింట్ల వరకూ పడిపోయిన ఈ సూచి కీలకమైన 60,000 పాయింట్లస్థాయిని సైతం కోల్పోయింది. షార్ట్ కవరింగ్ ప్రభావంతో భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది. ఈ సూచి క్రితం రోజు 550 పాయింట్లకుపైగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈ నిఫ్టీ 175 పాయింట్లు పడిపోయి, 18,000 పాయింట్ల దిగువన 17,938 పాయింట్ల వద్ద ముగిసింది. వివరాలివి…
ఐపీవో ధరలో సగమైన పేటీఎం
పేమెంట్ ప్లాట్ఫామ్ పేటీఎం షేరు కేవలం రెండు నెలల్లో ఇన్వెస్టర్లకు భారీ నష్టాల్ని తెచ్చిపెట్టింది. పేటీఎం మాతృసంస్థ ఒన్97 కమ్యూనికేషన్స్ షేర్లు బుధవారం రూ.997 వద్దకు పడిపోయాయి. నవం బర్లో రూ. 2,150 ధరతో ఈ కంపెనీ ఐపీవోకు వచ్చింది. అదేనెలలో లిస్టింగ్ రోజున రూ.1,961 గరిష్ఠస్థాయిని నమోదు చేసింది.
రెండ్రోజుల్లో 5.24 లక్షల కోట్ల నష్టం
వరుసగా రెండురోజులపాటు జరిగిన మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు రూ.5.24 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ. 2,74,77,790 కోట్లకు పడిపోయింది. ఈ జనవరి 17న వీటి విలువ రూ.2,80,02,438 కోట్ల రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే.