ముంబై, నవంబర్ 10: స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నప్పటికీ పవర్, యుటిలిటీ, మెటల్ సూచీలకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకోగలిగాయి. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 72.48 పాయింట్లు పెరిగి 64,904.68 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక దశలో 251 పాయింట్లు పడిపోయిన సూచీలకు చివర్లో మదుపరులు కొనుగోళ్లకు మద్దతు తెలపడంతో తిరిగి కోలుకోగలిగాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 30 పాయింట్లు అందుకొని 19,425.35 వద్ద నిలిచింది. మొత్తంమీద ఈ వారంలో బీఎస్ఈ బెంచ్మార్క్ 540.9 పాయింట్లు, నిఫ్టీ 194.75 పాయింట్ల చొప్పున బలపడ్డాయి. మార్కెట్లో ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్లు నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ ఇండెక్స్లు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.
సంవత్ 2079 సంవత్సరంలో సూచీ లు భారీగా లాభపడ్డాయి. ఈ ఏడాదిలో సెన్సెక్స్ 5,072.02 పాయింట్లు లేదా 8.47 శాతం లాభపడగా, నిఫ్టీ సైతం 1,694.6 పాయింట్లు లేదా 9.55 శాతం చొప్పున ఎగిశాయి. అంతర్జాతీయ సానుకూల అంశాలకు తోడు దేశీయ ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతుండటం సూచీలకు దన్ను గా నిలిచాయి. ఈ ఏడాదిలో స్టాక్ మార్కె ట్లో లిైస్టెన సంస్థల విలువ రూ.43.81 లక్షల కోట్లు పెరిగి రూ.3,20,29,232 కోట్లకు చేరుకున్నది.
దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 12న స్టాక్ ఎక్సేంజ్లలో గంటపాటు మూరత్ ట్రేడింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7.15 గంటల వరకు కొనసాగనున్న ట్రేడింగ్లో షేర్ల క్రయవిక్రయాలు జరగనున్నాయి.