Stock Market Closing Bell | 2023లో సరికొత్త రికార్డులను నెలకొల్పిన భారత స్టాక్ మార్కెట్లు.. ఏడాది చివరి రోజు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో మొదలైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు పతనమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల పవనాలు సైతం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి.
ఉదయం సెన్సెక్స్ 72,351.59 పాయింట్ల వద్ద నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇంట్రాడేలో 72,082.64 వద్ద కనిష్ఠానికి చేరుకొని.. చివరకు 170.12 పాయింట్ల నష్టపోయి 72,240.26 వద్ద ముగిసింది. నిఫ్టీ 47.30 పాయింట్లు పడిపోయి 21,731.40 వద్ద స్థిరపడింది. దాదాపు 1,758 షేర్లు పురోగమించగా, 1,533 షేర్లు క్షీణించాయి. 54 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ప్రైజెస్, ఐచర్ మోటార్స్ లాభపడగా.. బీపీసీఎల్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్ నష్టపోయాయి.