Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశం ప్రారంభమైన విషయం తెలిసిందే. మరో వైపు గురువారం పార్లమెంట్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ క్రమంలో సూచీలు నష్టాల్లో మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 71,073.04 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ప్రారంభంలో 70,846.04 కనిష్ఠానికి చేరుకుంది. ఆ తర్వాత సూచీలు పెరుగుతూ వచ్చాయి. ఇంట్రాడేలో 71,851.39 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 612.21 పాయింట్ల లాభంతో 71,752.11 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 203.60 పాయింట్ల లాభంతో 21,725.70 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్లో దాదాపు 2,113 షేర్లు పురోగమించగా.. 1,137 షేర్లు క్షీణించాయి. మరో 63 షేర్లు మాత్రం మారలేదు.
నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, ఐషర్ మోటార్స్, సన్ ఫార్మా, దివీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్ లాభపడ్డాయి. ఎల్అండ్టీ, టైటాన్ కంపెనీ, టాటా కన్స్యూమర్, బీపీసీఎల్ నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్ మినహా, ఆటో, బ్యాంక్, హెల్త్కేర్, పవర్, మెటల్, రియాల్టీ ఒక్కొక్కటి ఒకటి నుంచి రెండుశాతం వరకు పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ దాదాపు 2శాతం వరకు పెరిగింది.