ముంబై, నవంబర్ 28: క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు తరలి వస్తున్నందున స్టాక్ సూచీలు సరికొత్త రికార్డుల్ని సృష్టించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నేతృత్వంలో సోమవారం జరిగిన ర్యాలీలో బీఎస్ఈ సెన్సెక్స్ 211 పాయింట్లు పెరిగి 62,505 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 62,701 పాయింట్ల జీవితకాల గరిష్ఠస్థాయిని ఈ సూచీ తాకింది. మరోవైపు సెన్సెక్స్కంటే ఇప్పటివరకూ వెనుకబడి ఉన్న ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 18,614 పాయింట్ల ఆల్టైమ్ హైకి చేరి కొత్త రికార్డు నెలకొల్పింది. ఇది చివరకు 50 పాయింట్లు లాభపడి 18,563 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు ప్రధాన సూచీలు కొత్త రికార్డుస్థాయి వద్ద ముగియడం గమనార్హం. మార్కెట్ సెంటిమెంట్, నిధుల ప్రభావం మార్కెట్లను కొత్త రికార్డుస్థాయికి చేర్చాయని, అటు విదేశీ ఇన్వెస్టర్లు, ఇటు దేశీ ఫండ్స్ కలిసికట్టుగా కొనుగోళ్లు జరుపుతున్నాయని కొటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజరీ సీఈవో లక్ష్మీ అయ్యర్ చెప్పారు.
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా రిలయన్స్ 3.48 శాతం ర్యాలీ జరిపింది. నెస్లే, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్లు స్వల్పంగా లాభపడ్డాయి.
ఇప్పటికే ఆల్టైమ్ రికార్డుస్థాయిలో ట్రేడవుతున్న బీఎస్ఈ సెన్సెక్స్ మరింత దూకుడు ప్రదర్శిస్తుందన్న అంచనాల్ని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ వ్యక్తం చేసింది. కార్పొరేట్ లాభాల వృద్ధి, వడ్డీ రేట్ల పెంపుబాట ఆధారంగా వచ్చే 12 నెలల్లో సెన్సెక్స్ 80,000 పాయింట్ల స్థాయిని అందుకునేందుకు 30 శాతం అవకాశం ఉందని తాజాగా విడుదల చేసిన రిపోర్ట్లో పేర్కొంది. అయితే బేస్ కేస్లో 2023 డిసెంబర్కల్లా సూచీ 68,500కు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ రిథిమ్ దేశాయ్ తెలిపారు. ఈ సానుకూల అంచనాలకు మోర్గాన్ స్టాన్లీ చెపుతున్న కారణాలివి…