ముంబై, జనవరి 10: హైదరాబాద్లో ఓ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్టు స్టెల్లార్ వాల్యూ చైన్ సొల్యూషన్స్ మంగళవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మరో ఐదు నగరాల్లోనూ 2026కల్లా డైరెక్ట్-టు-కన్జ్యూమర్ (డీ2సీ) ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను తెస్తున్నట్టు చెప్పింది. హైదరాబాద్తోపాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతాల్లో దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడులతో వీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు స్టెల్లార్ వాల్యూ చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ అన్షుమన్ సింగ్ వివరించారు. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఎఫ్ఎంసీజీ, గృహాలంకరణ వస్తూత్పత్తుల మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఈ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను నిర్మిస్తున్నామని ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు. ఒక్కో సెంటర్ను సుమారు 12 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.
ఈ క్రమంలోనే ఈ ఆరు గిడ్డంగులతో డీ2సీ ఫుల్ఫిల్మెంట్ స్పేస్ ఆయా నగరాల్లో వచ్చే 3-4 ఏండ్లలో 70 లక్షల చదరపు అడుగుల మేర పెరుగుతుందన్నారు. ‘టెక్నాలజీతో కూడిన మా ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, అత్యాధునిక రవాణా సదుపాయాలు డీ2సీ బ్రాండ్లకు కలిసొస్తాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంటర్ప్రెన్యూర్స్కు సైప్లెపరమైన అంశాల్లో ఊతమివ్వడమే మా లక్ష్యం’ అని ఈ సందర్భంగా అన్షుమన్ సింగ్ అన్నారు. కాగా, ఈ సెంటర్లు.. కస్టమర్లకు వేగంగా వారి బుకింగ్స్ను చేరవేయడానికి, రిటర్న్స్ ఉంటే తీసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.