హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సైబర్ సెక్యూరిటీ సమస్యలను పరిష్కరించే సంస్థలకు హైదరాబాద్ వేదికగా మారిందని, సైబర్ సెక్యూరిటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విరాజిల్లుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారం రాయదుర్గం ఐటీ కారిడార్లో సైబర్ ఆర్క్ కంపెనీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డిజిటలైజేషన్, డాటా కీలకంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా కంపెనీలకు సైబర్ సెక్యూరిటీ పెను సవాలుగా మారిందని పేర్కొన్నారు. అలాంటి కంపెనీలకు సరైన పరిష్కారాలు చూపే నైపుణ్యం కలిగిన మానవ వనరులు హైదరాబాద్లో పుష్కలంగా ఉన్నాయని, ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ పాలసీని తీసుకువచ్చిందని వివరించారు. ఈ టెక్నాలజీపై పనిచేసే కంపెనీలు 230కి పైగా ఇక్కడ ఉన్నాయని చెప్పారు. సైబర్ నేరాలను అరికట్టాలంటే మరింత అధునాతనమైన రక్షణ అవసరమని, ఆ దిశగా కంపెనీలు సైబర్ సెక్యూరిటీలో పరిష్కారాలు కనిపెట్టాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
డాటా మేనేజ్మెంట్లో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి, ఆయా కంపెనీలతో కలిసి తెలంగాణ ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని 2018లోనే ఏర్పాటు చేసిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. సైబర్ సెక్యూరిటీపై సమర్థంగా పనిచేసే వ్యవస్థ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నదని తెలిపారు. ఇప్పటివరకు అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలు తమ రెండో అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తుండగా, తాజాగా ఇజ్రాయిల్కు చెందిన సైబర్ ఆర్క్ కంపెనీ కూడా తమ రెండో అతి పెద్ద కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు. ఆ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు.
ఇప్పటికే 110 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న సైబర్ ఆర్క్ కంపెనీ.. ప్రపంచవ్యాప్తంగా 8 వేల మంది వినియోగదారులకు కస్టమర్ ఐడెంటిటీ సెక్యూరిటీలో గ్లోబల్ లీడర్గా కొనసాగుతున్నదని కొనియాడారు. అటువంటి కంపెనీ అత్యంత ముఖ్యమైన ఆర్ అండ్ రిసోర్స్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ను ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలకు వినూత్న సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ను అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్లో నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేశామని సైబర్ ఆర్క్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పెరెట్జ్ రెగెవ్ తెలిపారు. ప్రసుత్తం సైబర్ నేరగాళ్లు అధునాతన పద్ధతులను అవలంభిస్తుండటంతో దానిని అడ్డుకునేందుకు తమ కంపెనీ అత్యంత రక్షణతో కూడిన సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అందిస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, సైబర్ ఆర్క్ ఇండియా రీజినల్ సేల్స్ డైరెక్టర్ రోహన్ వైద్య, ఉద్యోగులు పాల్గొన్నారు.