Minister Sridhar Babu | హైదరాబాద్, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న-మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) కోసం ప్రతిపాదిత నూతన విధానాన్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. చిన్నతరహా పరిశ్రమల కోసం ప్లగ్ అండ్ ప్లే పద్దతిలో స్థలాలు కేటాయిస్తామన్న ఆయన..పరిశ్రమలకు భూములను లీజు పద్దతిలో కేటాయిస్తామని, నిబంధనలకు లోబడి వాటిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు.
బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, ఐటీ రంగ విస్తరణకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్నదని, భవిష్యత్తులోనూ ఇదే ఒరవడిని కొనసాగించేందుకు నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు.
ఆకాశాన్ని అంటుతున్న భూముల ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న తరహా పరిశ్రమలు స్థాపించేవారికి చిన్నచిన్న ప్లాట్లలో ప్లగ్ అండ్ ప్లే విధానంతో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పరిశ్రమ ఏర్పాటునకు ముందుకొచ్చేవారికి లీజు పద్ధతిలో వాటిని కేటాయించాలని నిర్ణయించినట్లు, దీనివల్ల చిన్నతరహా యూనిట్లు ఏర్పాటు చేసుకునేవారికి ఆర్థికభారం పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
జిల్లాలవారీగా ఆయా ప్రాంతాల్లోని ముడి సరుకు ఆధారంగా చిన్న తరహా పారిశ్రామికవాడలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. బహుళజాతి కంపెనీలకు సర్కార్ ఎల్లప్పుడూ స్వాగతిస్తున్నదని, ఇటువంటి భారీ పరిశ్రమల ద్వారా ఎకోసిస్టం అభివృద్ధి చెంది పలు చిన్న స్థాయి సంస్థలకు దన్నుగా నిలువనున్నదన్నారు.
సబ్సిడీలపై అధ్యయనం..
పెట్టుబడులను ఆకట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నదని, ముఖ్యంగా సబ్సిడీలపై వివిధ రాష్ర్టాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కచ్చితంగా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకంటే భిన్నంగా సబ్సిడీలు ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటాయని మంత్రి స్పష్టంచేశారు. రాష్ట్రంలో సమగ్ర పారిశ్రామికాభివృద్ధి కోసం కన్సల్టెంట్ చేత అధ్యయనం చేయిస్తున్నట్లు, ఈ నివేదిక వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాల వారీగా పరిశ్రమల ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఓఆర్ఆర్ వెలుపల, ఆర్ఆర్ఆర్కు సమీపంలో ఎటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేయాలనేది దీని ద్వారా స్పష్టమవుతుందన్నారు.
ఇండస్ట్రియల్ కారిడార్కు చర్యలు..
హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటునకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని, ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు ఒక్క వెస్ట్జోన్కే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకు విస్తరించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. మహిళలు స్వయంశక్తితో పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తమ ప్రభుత్వం సహకారం అందిస్తున్నదని, ఇందులో భాగంగా సుల్తాన్పూర్లో ఏర్పాటు చేసిన విధంగానే పూర్తిగా మహిళా పారిశ్రామికవేత్తలు ఉండే విధంగా ప్రత్యేక మహిళా పారిశ్రామికవాడను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఒకేచోట కాలుష్యకారక పరిశ్రమల ఏర్పాటువల్ల కాలుష్య సమస్య ఉత్పన్నమవుతున్నదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని 3 వేల ఏకరాల విస్తీర్ణంలో ఒక్కొక్కటి చొప్పున వివిధ ప్రాంతాల్లో ఏడెనిమిది ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఫిల్మ్సిటీ వైపు జపాన్ పారిశ్రామికవాడ..
పరిశ్రమలన్నీ హైదరాబాద్ చుట్టు కేంద్రీకృతం కాకుండా జిల్లాలకు విస్తరించనున్నట్లు, ఇందులో భాగంగా ఈస్ట్జోన్ పరిధిలో ఎల్బీనగర్ వైపు జపాన్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్క్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. జపాన్కు చెందిన పలు భారీ పరిశ్రమలు రాష్ట్రంలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు, వారికోసం రామోజీ ఫిల్మ్సిటీ వైపు సుమారు 800ఎకరాల్లో ప్రత్యేకంగా జపాన్ పారిశ్రామికవాడను ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఐటీ సంస్థలను ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి డబ్ల్యూఈఎఫ్ ప్రతినిధులు ముందుకొచ్చారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రెండు చోట్ల డ్రైపోర్టులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా నల్గొండతోపాటు జహీరాబాద్ ప్రాంతంలో డ్రై పోర్ట్లను ఏర్పాటు చేస్తామన్నారు.
26 నుంచి బయో ఏషియా సదస్సు
ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు హైదరాబాద్ వేదికగా బయో ఏషియా సదస్సు జరగబోతున్నది. ఈ అంతర్జాతీయ సదస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. పరిశ్రమలను ఆకర్శించడంలో రాష్ర్టాల మధ్య పోటీ సహజంగానే ఉంటుందని, అలాగే కర్ణాటక, తెలంగాణ మధ్య కూడా పోటీ ఉన్నదన్నారు. కర్ణాటకకు వెళ్ళే జపాన్ సంస్థను ఒప్పించి తెలంగాణకు తెచ్చిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.