న్యూఢిల్లీ : భారత టెక్ స్టార్టప్ హెల్తిఫైమి మొత్తం ఉద్యోగుల్లో 20-25 శాతం మంది ఉద్యోగులతో సమానమైన దాదాపు 150 మందిని తొలగించింది. మ్యాటర్ ఎక్స్పర్ట్స్, క్వాలిటీ అనలిటిక్స్, ప్రోడక్ట్, మార్కెటింగ్ విభాగాల్లో పలువురిపై వేటు వేసింది. హెల్తిఫైమి 2.0పై వనరులను సమర్ధవంతంగా వినియోగిస్తామని లేఆఫ్స్ను ధ్రువీకరిస్తూ కంపెనీ పేర్కొంది.
స్ధూల ఆర్ధిక పరిస్ధితుల నేపధ్యంలో, అనిశ్చితి వాతావరణం నెలకొన్న క్రమంలో హెల్తిఫైమి సైతం గత కొద్దివారాలుగా ఉద్యోగులను తొలగిస్తున్న స్టార్టప్లు, టెక్ దిగ్గజాల సరసన నిలిచింది. ఇక ఇటీవల దేశీ షార్ట్ వీడియో ప్లాట్ఫాం జోష్ పేరెంట్ కంపెనీ వెర్సే కూడా 150 మంది ఉద్యోగులను సాగనంపింది. అంచనాలు, హైరింగ్కు అనుగుణంగా వృద్ధి నమోదు కాకపోవడంతో 150 మంది టీం సభ్యులను తొలగిస్తూ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని హెల్తిఫైమి ప్రతినిధి స్పష్టం చేశారు.
పరిహార ప్యాకేజ్లో భాగంగా తొలగించిన ఉద్యోగులకు రెండు నెలల వేతనం అందిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కౌన్సెలింగ్, అవుట్ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా అందిస్తామని, మెడికల్ ఇన్సూరెన్స్ 2023 వరకూ వర్తింపచేస్తామని తెలిపింది. యూజర్లు తమ ఫిట్నెస్ కార్యకలాపాలు, డైట్ను చెక్ చేసుకునేందుకు దేశీ టెక్ స్టార్టప్ హెల్తిఫైమి అనుమతిస్తుంది.