Repo Rate | న్యూఢిల్లీ, జూలై 31: వచ్చే నెల జరుగబోయే రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉండొచ్చని ప్రముఖ విదేశీ ప్రైవేట్రంగ బ్యాంక్ స్టాండర్డ్ చార్టర్డ్కు చెందిన ఆర్థికవేత్త కనిక పస్రిచ అన్నారు. నిజానికి ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తమ వడ్డీరేట్లను పెంచడంతో అవి 22 ఏండ్ల గరిష్ఠానికి చేరిన విషయం తెలిసిందే. ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల మధ్య తేడా కేవలం 100 బేసిస్ పాయింట్లే ఉన్నది. అయినప్పటికీ రాబోయే రివ్యూలో రెపో, రివర్స్ రెపో జోలికి ఆర్బీఐ వెళ్లకపోవచ్చనే కనిక చెప్తున్నారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచినా.. ఆర్బీఐ ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోవచ్చనే అన్నారు. అంతేగాక తదుపరి మూడు ద్రవ్యసమీక్షల్లోనూ వడ్డీరేట్ల పెంపునకు అవకాశాల్లేవంటున్నారు. ఆగస్టు 8-10 తేదీల్లో ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ఆర్బీఐ నిర్వహించబోతున్నది. దీంతో గత ద్రవ్యసమీక్షల్లో చూపిన వడ్డీరేట్ల స్థిరమైన వైఖరినే ఈసారీ ఆర్బీఐ కొనసాగిస్తుందన్న అభిప్రాయాలుంటున్నాయి. ఇదిలావుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో రెపో రేటును ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్లు తగ్గించే వీలుందని కనిక విశ్లేషిస్తున్నారు. 2025లో 225 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చన్నారు.