Spicejet | ఇటీవల విమానాల్లో సాంకేతిక లోపాల నేపథ్యంలో ప్రైవేట్ ఎయిర్లైన్స్ స్పైస్జెట్కు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) గట్టి షాక్ ఇచ్చింది. సాంకేతిక అంశాలు, సేఫ్టీ తదితర అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని వచ్చే 8 వారాల పాటు అనుమతించిన వాటిల్లో 50 శాతం విమాన సర్వీసులు మాత్రమే నడుపాలని స్పైస్జెట్ను ఆదేశించింది.
స్పైస్జెట్కు డీజీసీఐ ఆదేశాలతో గురువారం స్టాక్ మార్కెట్లో ఆ ఎయిర్లైన్స్ స్క్రిప్ట్ భారీగా నష్టపోయింది. ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో 9.66 శాతం పడిపోయి 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.34.60 వద్దకు చేరుకున్నది. డీజీసీఏ ఆదేశాలపై స్పైస్జెట్ రియాక్టయింది. డీజీసీఏ ఆదేశాల ప్రభావం తమ విమాన సర్వీసులపై ఉండబోదని పేర్కొంది. తమ సంస్థ ఎటువంటి విమాన నర్వీసులను రద్దు చేయలేదన్నది.
ఇటీవల తలెత్తిన సాంకేతిక సమస్యలపై చర్యలు చేపట్టామని స్పైస్జెట్ తెలిపింది. డీజీసీఏ ఆదేశాలకు అనుగుణంగా తాము పని చేస్తామని వెల్లడించింది. గత నెల 31- ఈ నెల ఐదో తేదీ మధ్య ఎనిమిది స్పైస్జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో స్పైస్జెట్ యాజమాన్యానికి వివరణ ఇవ్వాలని డీజీసీఐ షోకాజ్ నోటీసు జారీ చేసింది.