హైదరాబాద్, సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాలకు విస్తరిస్తున్నది. సరికొత్త ఆవిష్కరణలతో వివిధ రంగాల్లో సులభతరంగా పనులు చేసుకునే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఇదే కోవలో రోబోటిక్స్, డ్రోన్స్ వంటివి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నది. తాజాగా ఆలిండియా రోటిక్స్ అసోసియేషన్తో తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని టీ హబ్, టీఎస్ఐసీ, టాస్క్, రిచ్, టీఎస్ఆర్టీసీ సంస్థలతోపాటు ప్రైవేటు రంగంలోని హెచ్బోట్స్, మారుత్ డ్రోన్స్, అన్వి రోబోటిక్స్, ఎక్స్ప్రెస్, స్టూమ్యాగ్జ్ సంయుక్త ఆధ్వర్యంలో రోబోటిక్స్ తయారు చేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
సెప్టెంబర్ 2న టీ హబ్లో జరగనున్న ‘హర్ విభాగ్ మే రోబోటిక్స్’ కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ప్రారంభించనున్నారు. 2025 నాటికి 10లక్షల రోబోటిక్స్ను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రోబోటిక్స్తో పాటు డ్రోన్స్ విభాగంలో పలు స్టార్టప్ కంపెనీలు ఎన్నో ఆవిష్కరణలు చేసి తమ సత్తాను చాటాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో డ్రోన్ వినియోగాన్ని గణనీయంగా పెంచడంలో స్టార్టప్ కంపెనీలు విజయవంతమయ్యాయి. ఇదే స్పూర్తితో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రభుత్వ పరంగా అన్ని శాఖల నుంచి సహకారం అందిస్తూ, ప్రైవేటు స్టార్టప్ కంపెనీలు చేసే ఆవిష్కరణలను అన్ని శాఖల్లో వినియోగించేలా ప్రోత్సహించనున్నారు.