న్యూఢిల్లీ, నవంబర్ 27: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 6.4 శాతం వృద్ధిచెందుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ అంచనా వేసింది. గతంలో ప్రకటించిన 6 శాతం అంచనాను తాజాగా పెంచింది. అయితే వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాల్ని 6.9 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధిచెందగా, ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది.
ప్రస్తుతం అధిక ఆహార ధరలతో పాటు ఎగుమతులు బలహీనంగా ఉన్నప్పటికీ, దేశీయ డిమాండ్ కారణంగా 2023-24 వృద్ధి రేటును పెంచుతున్నామని, అంతర్జాతీయ వృద్ధి మాంద్యం, అధిక వడ్డీ రేట్ల ప్రభావం కొంత ఆలస్యంగా వ్యాపించనున్నందున వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాల్ని తగ్గిస్తున్నామని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సోమవారం ఒక నివేదికలో వివరించింది. ఇతర గ్లోబల్ ఏజెన్సీలు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, ఫిచ్లు భారత్ వృద్ధి రేటు 2023-24లో 6.3 శాతం ఉంటుందని భావిస్తుండగా, ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో 6.5 శాతం చొప్పున జీడీపీ వృద్ధిచెందుతుందని రిజర్వ్బ్యాంక్ అంచనాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.