న్యూఢిల్లీ, జూన్ 24 : ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) భారత జీడీపీ వృద్ధిరేటు 6.6 శాతానికే పరిమితం కావచ్చని ప్రముఖ గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ ఎస్అండ్పీ గ్లోబల్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) 7.7 శాతంగా నమోదైన నేపథ్యంలో ఇంధన ధరలు, వర్షాభావ పరిస్థితులు.. దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయని తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో చెప్పింది.
ఆర్బీఐ ద్రవ్య సమీక్షలోనూ ఈసారి దేశ జీడీపీ 6.6 శాతానికే పరిమితం కావచ్చని పేర్కొన్న సంగతి విదితమే. ఇందుకు తగ్గట్టే ఎస్అండ్పీ గ్లోబల్ అంచనాలూ ఉండటం గమనార్హం. కాగా, వినియోగదారుల ద్రవ్యోల్బణం పెరిగే వీలుందని, అధిక ఇంధన ధరలతో తయారీదారులు ఉత్పాదక వ్యయాన్ని కస్టమర్లపై మోపుతుండటమే కారణమన్నది.