Sovereign Gold Bond | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో సావరిన్ గోల్డ్ బాండ్ సబ్స్క్రిప్షన్ సోమవారం మొదలైంది. ఈ నెల 10న ముగియనున్న సబ్స్క్రిప్షన్ను ఈ నెల 14న సెటిల్మెంట్ చేశారు. గత ఏడేండ్లలో సావరిన్ గోల్డ్ బాండ్ ధర సుమారు 109 శాతం పెరిగిందని ఆర్బీఐ వెబ్సైట్ పేర్కొంది. 2015 నవంబర్లో సావరిన్ గోల్డ్ బార్పై సబ్స్క్రైబర్లకు అందించిన ధర రూ.2684.
ప్రస్తుతం గ్రామ్ పుత్తడి ధర ప్రకారం ఇప్పుడు జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ ధర రూ.5611. ఆన్లైన్లో దరఖాస్తు చేసి, డిజిటల్ మోడ్లో చెల్లింపులు జరిపితే గ్రామ్ బంగారంపై రూ.50 వరకు తగ్గింపు పొందొచ్చు. అంటే ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ ధర గ్రామ్ బంగారం మీద రూ.5561.
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, పోస్టాఫీసు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజ్లు (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) కోసం అప్లయ్ చేసుకోవచ్చు.
భారతీయులు, ట్రస్ట్లు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్), స్వచ్ఛంద సంస్థలు సబ్స్క్రిప్షన్ కోసం దరఖాస్తుచేసుకోవచ్చు. మైనర్ల తరుపున పేరెంట్స్లో ఒకరు గానీ, ఇద్దరు సంయుక్తంగా గానీ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్పై వడ్డీ ఇష్యూ చేసిన తేదీ నుంచి మొదలవుతుంది. బాండ్ నామమాత్రపు విలువపై ఏడాదికి 2.50 శాతం ఫిక్స్డ్ రేటుతో ఆరు నెలలకోసారి వడ్డీ పే చేస్తారు. ఈ సావరిన్ గోల్డ్ బాండ్ల గడువు ఎనిమిదేండ్లు. ఎస్జీబీల మెచ్యూరిటీపై వచ్చే పెట్టుబడి లాభాలపై పన్ను మినహాయింపు క్లయిమ్ చేసుకోవచ్చు.