జహీరాబాద్, నవంబర్ 10: ఐస్క్రీమ్ల తయారీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా అవతరించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్పూర్ శివారులో ఓ భారీ ప్లాంట్ను హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్ (హాప్) ప్రారంభించింది. ఈ అత్యాధునిక ఫ్యాక్టరీ భారత్లోనేగాక దక్షిణాసియాలోనే అతిపెద్ద ఐస్క్రీమ్ తయారీ కేంద్రం కావడం గమనార్హం. మార్కెట్లో ఎంతో ప్రజాదరణ పొందిన అరుణ్ ఐస్క్రీమ్స్, ఇబాకో, హాట్సన్ పెరుగు, ఆరోక్య పాల బ్రాండ్లు హాట్సన్కు చెందినవేనన్న విషయం తెలిసిందే. ఐస్క్రీమ్లతోపాటు చాక్లెట్స్ తయారీ యూనిట్నూ ఇక్కడ నెలకొల్పడం విశేషం. కాగా, గురువారం ఈ ప్లాంట్ను రాష్ట్ర పాడి పరిశ్రమలు, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని తెలిపారు.
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సులభంగా, కావాల్సిన అన్ని అనుమతులు ఇస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే రూ.400 కోట్లతో హాట్సన్ ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందన్నారు. సమైక్య రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల స్థాపనకు ఎన్నో కష్టాలు పడ్డారని ఈ సందర్భంగా మంత్రి తలసాని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ కొత్త పారిశ్రామిక పాలసీని తెచ్చి పారిశ్రామికాభివృద్ధికి బంగారు బాటలు వేశారన్నారు. ఇక రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో ఎన్నో పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయన్నారు. రైతులను ప్రోత్సహించేందుకు వ్యవసాయ అనుబంధ ఫ్యాక్టరీల ఏర్పాటుకు సహకరిస్తున్నట్టు వెల్లడించారు. అంతేగాక పారిశ్రామిక పాలసీతో ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తున్నట్టు గుర్తుచేశారు.
త్వరితగతిన అనుమతులు
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త పారిశ్రామిక పాలసీతో ఫ్యాక్టరీల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు వస్తున్నాయని చెప్పారు. రైతుల మేలుకోరి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. మారుమూల గ్రామాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు, జిల్లా ఎస్పీ రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనే మరెక్కడా లేనివిధంగా మన జహీరాబాద్లో అతిపెద్ద ఐస్క్రీమ్ తయారీ కేంద్రం ఏర్పాటు కావడం సంతోషకరం. రూ.400 కోట్లతో దీన్ని హాట్సన్ ఏర్పాటు చేసింది. ఈ పెట్టుబడితో రాష్ట్రంలో హాట్సన్ మొత్తం రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టినైట్టెంది. తెలంగాణలో జరుగుతున్న శ్వేత విప్లవానికి ఇది నిదర్శనం. ఈ ప్లాంట్ రాకతో స్థానిక పాడి రైతులకు, వందలాది మంది నిరుద్యోగ యువతకు గొప్ప ప్రయోజనం చేకూరింది.
-కే తారక రామారావు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
హాట్సన్ అగ్రో ప్రొడక్ట్స్