Sony-Zee Merger | ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ సోనీ కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్లో జీ ఎంటర్టైన్మెంట్ విలీన ఒప్పందానికి చెల్లు చీటీ ఇచ్చింది. ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఈ మేరకు జీ ఎంటర్టైన్మెంట్కు టర్మినేషన్ నోటీసు ఇచ్చినట్లు సోమవారం ధ్రువీకరించింది. దీంతో 1000 కోట్ల డాలర్ల బడ్జెట్తో భారత్లో ఆపరేషన్స్, జీ’ తో భాగస్వామ్య ఒప్పందానికి తెర పడింది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ డాట్ కాం ఇంక్ వంటి సంస్థలతో పోటీ పడేందుకు సోనీ-జీ ఎంటర్టైన్మెంట్ అగ్రిమెంట్తో దేశంలోనే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ కంపెనీగా నిలుస్తుందని భావించారు. ప్రస్తుతం డిస్నీతో సంప్రదింపులు జరుపుతున్న రిలయన్స్కూ పోటీ ఇస్తుందని భావించారు.
2021 డిసెంబర్ 22న విలీన ఒప్పందంపై జీ ఎంటర్టైన్మెంట్, సోనీ సంతకాలు చేశాయి. ఈ సంయుక్త కంపెనీలో సోనీ పరోక్షంగా 50.86 శాతం వాటా, జీ ఎంటర్టైన్మెంట్ 3.99, మిగతా జీ ఎంటర్టైన్మెంట్ వాటాదారులకు 45.15 శాతం వాటాలు ఉంటాయి. ఈ ఒప్పందానికి చట్టబద్ధమైన అనుమతులు 8-10 నెలల్లో పూర్తవుతాయని భావించారు. ఈ ఒప్పందం అమలుకు రెండేండ్ల గడువు విధించారు. ఈ గడువు కూడా గత నెల 21తో ముగిసింది. తదుపరి మరొక నెల రోజులు.. అంటే 2024 జనవరి 21 వరకూ పొడిగించారు. కానీ, ఈ నెల రోజుల్లో ఇరు పక్షాల మధ్య స్వేచ్ఛగా సంప్రదింపులకు అవకాశాలు ముగిసిపోయినట్లు కనిపిస్తున్నది.
జీ ఎంటర్టైన్మెంట్ ఎండీ కం సీఈఓ పునీత్ గోయెంకాతోపాటు సంస్థ ప్రమోటర్లపై కేసులు, రెగ్యులేటరీ సంస్థల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్, సోనీ విలీన ఒప్పందానికి బ్రేక్ పడినట్లు తెలుస్తున్నది. పునీత్ గోయెంకా నాయకత్వంపై సోనీ యాజమాన్యం సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే విలీన ఒప్పందం నుంచి సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్) వైదొలిగినట్లు ప్రకటించిందని తెలుస్తున్నది. అయితే, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియాకు లీగల్ నోటీసు ఇస్తామని జీ ఎంటర్టైన్మెంట్ వాదిస్తున్నది.