న్యూఢిల్లీ, నవంబర్ 3: వేతనాలు, బోనస్ పెంపులు, ప్రోత్సాహకాలతో ఉద్యోగుల్ని ఉత్సాహపర్చిన దేశీ ఐటీ పరిశ్రమ హఠాత్తుగా రూట్ మార్చుకుంది. ఈ పరిశ్రమకు ప్రధాన మార్కెట్ అయిన అమెరికాలో మాంద్యం వస్తుందన్న అంచనాలతో వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టిపెట్టింది. జీతాల పెంపులు, బోనస్ల్లో ఐటీ కంపెనీలు కోతపెడుతున్నాయని స్టాఫింగ్ సంస్థ జెఫెనో తెలిపింది. టాప్ ఐటీ కంపెనీలైన టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, విప్రోలు సైతం నియమకాల్ని తగ్గిస్తున్నాయన్నది. జెఫెనో డాటా ప్రకారం 2022 ఏప్రిల్ నుంచి ఐటీ సర్వీసుల కంపెనీలు హైరింగ్ను 41 శాతం తగ్గించాయి. టెక్నాలజీ సార్టప్లైతే 63 శాతం కుదించాయి. సాఫ్ట్వేర్ ప్రాడక్ట్ సంస్థలు నియామకాల్లో 58 శాతం కోతపెట్టాయి.
డిజిటలైజేషన్కు డిమాండ్ పెరగడంతో గత ఏడాది టాలెంట్ కోసం ఐటీ కంపెనీలు పోటాపోటీ ప్రోత్సాహకాలతో ఉద్యోగుల్ని ఆకర్షించాయి. భారీ ఎత్తున ఫ్రెషర్స్ను నియమించుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో విప్రో ఏకంగా నియామకాలను 95 శాతం తగ్గించింది. 2021లో 11,475 మందిని నికరంగా నియమించుకున్న సంస్థ..ఈ ఏడాది మాత్రం కేవలం 605 మందిని రిక్రూట్ చేసుకున్నది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు సంయుక్తంగా 20,144 మందిని రిక్రూట్ చేసుకున్నది. అంతక్రితం ఏడాది 42,590 మందిని నియమించుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టాప్-4 ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్లు 1.6 లక్షల మంది ఫ్రెషర్లను తీసుకుంటున్నట్లు గతంలో ప్రకటించాయి. కానీ, ప్రస్తుతం దీంట్లో సగం మందిని రిక్రూట్ చేసుకోవడానికి జంకుతున్నాయి. అంతక్రితం ఏడాది ఇవే సంస్థలు 2.2 లక్షల మందిని రిక్రూట్ చేసుకున్నాయి.
నియమాకాలు తగ్గించిన ఐటీ సంస్థలు
కారణాలు
ప్రస్తుతం ఐటీ నిపుణులకు ఆఫర్లు 60-70 శాతం మేర తగ్గాయని అంచనా. మార్కెట్లో ప్రతిభావంతులకు గతంలో 7-8 యాక్టివ్ ఆఫర్లు అందుబాటులో ఉండేవని, అందులో ఒకదాన్ని ఎంచుకునేవారని, ఇప్పుడా సంఖ్య గరిష్ఠంగా 2-3 ఆఫర్లకు తగ్గిందని జెఫెనో కో ఫౌండర్ కమల్ కామత్ చెప్పారు. ప్రోత్సాహకాల పెంపు సైతం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది బాగా తగ్గుతుందన్నారు. 30-40 శాతం తగ్గవచ్చన్నారు. ఆయా ఉద్యోగుల అనుభవం, నైపుణ్యాలకు అనుగుణంగా ప్రోత్సాహకంలో సగటు పెంపు నిరుడు 11-14 శాతం ఉన్నది. ఈ సంవత్సరం 5-8 శాతానికి తగ్గవచ్చని అంచనా. నిరుడు అనూహ్యమైన ప్యాకేజీలకు చేరిన ప్రతిభావం తులకు ఈ ఏడాది రివిజన్ స్కేల్ అంతంతమాత్రంగానే ఉంటుందన్నారు. గడిచిన ఏడాదికాలంలో ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ డిమాండ్ తగ్గుతుందని అనుకోవడం లేదు.
– థిర్రీ డెలాపోర్ట్, విప్రో సీఈవో, ఎండీ