Artificial Intellegence | రోజురోజుకు టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intellegence) వినియోగం వేగంగా పెరుగుతున్నది. దీంతో సాఫ్ట్ వేర్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా ఈ టెక్నాలజీని నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి గ్లోబల్ టెక్, సాఫ్ట్ వేర్ కంపెనీలు సైతం కృత్రిమ మేధ (ఏఐ) నైపుణ్యం గల ఇంజినీర్లను తీసుకోవడానికే ఆసక్తి చూపుతున్నాయి. ఈ టెక్నాలజీలో ప్రావీణ్యం గల వారికి అధిక వేతనాలు చెల్లిస్తున్నాయి. సాధారణ ఇంజినీర్ల కంటే ఏఐ నిపుణులకు 50 శాతం అధిక వేతనం చెల్లిస్తున్నాయని ఐటీ ఉద్యోగుల వేతనాలను ఎప్పటికప్పుడు విశ్లేషించే ప్లాట్ ఫామ్ ‘లెవెల్స్.ఎఫ్వైఐ’ తాజాగా విడుదల చేసిన నివేదికలో తేలింది.
గత నెలాఖరు నాటికి అమెరికాలో ఏఐ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల వేతనం సరాసరి మూడు లక్షల డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.2,49,31,650 అన్న మాట. సాధారణ ఇంజినీర్లతో పోలిస్తే ఏఐ ఇంజినీర్లు లక్ష డాలర్ల అధిక వేతనం అందుకుంటున్నారని ఈ నివేదిక వెల్లడించింది. రెండేండ్ల క్రితం అంటే 2022లో ఏఐ నిపుణులు, సాధారణ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల మధ్య వేతనంలో వ్యత్యాసం 30 శాతం ఉంటే, ఇప్పుడది 50 శాతానికి చేరుకున్నది.