Snapdeal IPO | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల హవా కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశీయ ఈ-కామర్స్ సంస్థ స్నాప్డీల్ కూడా ఉంది. స్నాప్ డీల్ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు వెళ్లేందుకు అనుమతించాలని సెబీకి దరఖాస్తు చేసుకున్నది. ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కోసం ఏర్పాట్లు చేస్తోంది. స్టాక్ మార్కెట్లో రూ.1,250 కోట్ల విలువైన షేర్ల విక్రయానికి రంగం సిద్ధం చేసుకున్నది. ఇంకా 30.8 మిలియన్ల షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద కేటాయించనున్నది.
స్నాప్డీల్తోపాటు పలు సంస్థలు కూడా ఐపీవోకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా జపాన్ కేంద్రంగా పని చేస్తున్న పెట్టుబడుల దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ మద్దతు గల కంపెనీలు స్టాక్ మార్కెట్బాట పడుతున్నాయి. మార్కెట్లలో నగదు ప్రవాహం పెరగడం, చిన్న ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండటంతో పలు కంపెనీలు ఐపీవోలకు వెళ్లేందుకు మొగ్గుతున్నాయి.
స్నాప్ డీల్ దేశ రాజధాని న్యూఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్నది. దీన్ని 2010లో కునాల్ బహల్, రోహిత్ బన్సల్ ప్రారంభించారు. గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లతో ఇది పోటీ పడుతున్నది. తాజాగా స్నాప్ డీల్ ప్రతిపాదించిన ఐపీవోలో కునాల్ బహల్, రోహిత్ బన్సల్ తమ వాటాలను విక్రయించడం లేదు. సాఫ్ట్ బ్యాంక్, ఫాక్స్కాన్, ఓట్రియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ బోర్డు తదితర సంస్థలు తమ వాటాల్లో కొంత విక్రయించనున్నాయి.