ముంబై: కొవిషీల్డ్ రెండు డోస్ల మధ్య గ్యాప్ రెండు నెలలు ఉంటే బావుంటుందని, అయితే, ఆరు నెలల తర్వాత థర్డ్ (బూస్టర్) డోస్ వేసుకోవాలని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ సైరస్ పూనావాలా చెప్పారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న కొంత కాలానికి యాంటీ బాడీలు తగ్గుతాయని మెడికల్ జర్నల్ లాన్సెట్లో వచ్చిన నివేదికపై శుక్రవారం ఆయనను మీడియా ప్రతినిధులు అడిగారు.
సైరస్ పూనావాలా స్పందిస్తూ యాంటీ బాడీలు తగ్గుముఖం పట్టడం నిజమేనన్నారు. కానీ మెమొరీ సెల్స్ యథాతథంగా ఉంటాయన్నారు. ఆరు నెలల తర్వాత యాంటీ బాడీలు తగ్గుతాయని, అందుకే తాను మూడో డోస్ తీసుకున్నానని వెల్లడించారు. ఏడెనిమిది వేల మంది సీరం ఇన్స్టిట్యూట్ ఉద్యోగులకు థర్డ్ డోస్ ఇచ్చినట్లు తెలిపారు.
కరోనాను నియంత్రించడానికి లాక్డౌన్ విధించడం సమర్థవంతమైన మార్గం కాదన్నారు. మరణాల రేటు ఎక్కువగా ఉన్నప్పుడు లాక్డౌన్ విధించడం సరైన నిర్ణయం అని సైరస్ పూనావాలా అన్నారు. మరణాల రేటు తక్కువగా ఉన్నపపుడు హెర్డ్ ఇమ్యూనిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.