హైదరాబాద్, మే 3: సినిమా ఈవెంట్స్, ప్రమోషన్లలో దేశంలో అగ్రగామి హైదరాబాద్కు చెందిన శ్రేయాస్ మీడియా తన వ్యాపారాన్ని క్రమంగా అంతర్జాతీయంగా విస్తరిస్తున్నది. మధ్య ప్రాచ్య, అమెరికా, ఏషియా పసిఫిక్తోపాటు దేశవ్యాప్తంగా వ్యాపార విస్తరణకు అవసరమైన రూ.30 కోట్ల నిధులను పలు మార్గాల ద్వారా సేకరించనున్నట్లు కంపెనీ ఫౌండర్ జీ శ్రీనివాస్ రావు తెలిపారు.
వ్యూహాత్మక, ప్రముఖ పెట్టుబడిదారుల నుంచి ఈ నిధులను సమీకరిస్తున్నట్లు తెలిపింది. 2011లో ప్రారంభమైన సంస్థ ఇప్పటి వరకు 1,500లకు పైగా ఈవెంట్లను విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. 2027 నాటికి ప్రతియేటా 650 సినిమా ప్రమోషన్లు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, అలాగే గ్రూపు టర్నోవర్ రూ.700 కోట్లు ఆశిస్తున్నట్లు తెలిపారు.