Old Car Renewal | మీరు 15 ఏండ్లు దాటిన వెహికల్.. ప్రత్యేకించి పాత కార్ల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ కోసం వెళుతున్నారా.. అయితే రిజిస్ట్రేషన్ ఫీజు తడిసిమోపెడవుతుంది. ఎనిమిది రెట్లు చెల్లించాల్సి ఉంటుంది. పాత వాహనాల వాడకాన్ని నిరుత్సాహ పరిచి.. కొత్త వాహనాల కొనుగోళ్లను పెంచడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇది 2022 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నది.
కమర్షియల్ వెహికల్స్.. ట్రక్కులు, బస్సులు ఎనిమిదేండ్ల తర్వాత ఫిట్నెస్ సర్టిపికెట్ రెన్యూవల్కు వెళ్లినా దాదాపు ఎనిమిది రెట్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు సోమవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఢిల్లీ, దాని పొరుగు ప్రాంతాల్లో 10 ఏండ్లు దాటిన డీజిల్, 15 ఏండ్లు దాటిన పెట్రోల్ వాహనాల యజమానులపై దీని ప్రభావం ఉండదు. వాటిపై ఇప్పటికే ఢిల్లీలో నిషేధం విధించారు.
ప్రస్తుతం 15 ఏండ్లు దాటిన రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఫీజు రూ.600. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అది రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. ఓల్డ్ బైక్ల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చార్జీలు రూ.300 నుంచి రూ.1,000కి పెరుగుతాయి. 15 ఏండ్లు దాటిన బస్, ట్రక్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఇప్పుడు రూ.1500 చెల్లించాలి. కానీ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రూ.12,500 చెల్లిస్తే గానీ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోలేరు.
ఇక ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకోవడం జాప్యమైతే నెలకు రూ.300, కమర్షియల్ వెహికల్స్కు రూ.500 ఫైన్ చెల్లించాల్సిందే. కమర్షియల్ వాహనాల రిజిస్ట్రేషన్లో జాప్యమైతే రోజుకు రూ.50 జరిమానా విధిస్తారు. అంతే కాదు పాత వాహనాలకు ప్రతి ఐదేండ్లకోసారి రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకోవాలి.
అలాగే, ఎనిమిదేండ్లు దాటిన కమర్షియల్ వాహనాలకు ప్రతియేటా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి. వాహనాలకు మాన్యువల్ అండ్ ఆటోమేటెడ్ ఫిట్ టెస్ట్కూ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. స్వచ్ఛంద పాత వాహనాల స్క్రాపింగ్ స్కీం కింద ఫిట్నెస్ టెస్ట్ సెంటర్ల ఏర్పాటుకు కూడా నోటిఫికేషన్లో మార్గదర్శకాలు, నిబంధనలు ఖరారు చేసింది కేంద్రం.