Reliance | గతవారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్లో టాప్-10 కంపెనీల్లో ఏడు సంస్థలు రూ.1,32,535.79 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోయింది. దాదాపు నాలుగు రోజుల సెలవులు గల గత వారం సెన్సెక్స్ 1,108.25 (1.86 %) పాయింట్లు నష్టపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, హెచ్యూఎల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ నష్టపోగా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, అదానీ గ్రీన్ ఎనర్జీ లాభ పడ్డాయి. గత సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలోని టాప్-10 స్క్రిప్ట్ల్లో ఒకటిగా అదానీ గ్రీన్ ఎనర్జీ చేరింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) రూ.43,491.37 కోట్ల మేరకు నష్టపోయి రూ.17,26,714.05 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.27,953.78 కోట్లు పతనమై రూ.7,35,611.35 కోట్లకు పరిమితమైంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.27,866.34 కోట్లు నష్టపోయి రూ.8,12,338.57 కోట్లకు పడిపోయింది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.14,631.11 కోట్లు కోల్పోయి రూ.4,31,028.49 కోట్ల వద్ద ముగిసింది.
ఐటీ దిగ్గజం టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 9,348.88 కోట్లు కోల్పోయి రూ.13,39,688.48 కోట్లకు చేరుకున్నది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.7,119.26 కోట్లు నష్టపోయి రూ. 5,05,737.77 కోట్ల వద్ద నిలిచింది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,125.05 కోట్లు పతనమై రూ.4,43,685.79 కోట్లకు చేరుకున్నది.
ఇక కొత్తగా టాప్-10 స్క్రిప్ట్ల్లో ఒకటిగా చేరిన అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.84,581.99 కోట్లు పెరిగి రూ.4,48,050.99 కోట్లకు చేరుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.5,559.02 కోట్లతో రూ. 5,29,739.59 కోట్ల వద్ద స్థిర పడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,249.45 కోట్లు పెరిగి రూ.4,61,848.65 కోట్ల వద్ద ముగిసింది. గురువారం మహావీర్ జయంతి, అంబేద్కర్ జయంతి, శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే సందర్భంగా స్టాక్ మార్కెట్లు మూత పడ్డాయి.