న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్లో స్టాక్ సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ షేర్ల నేతృత్వంలో ర్యాలీ జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 167 పాయింట్లు పెరిగి 58,297 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ స్థాయిలో సెన్సెక్స్ ముగియడం ఇదే ప్రధమం. ఈ సూచి ఇంట్రాడేలో 58,515 పాయింట్ల రికార్డుస్థాయిని తాకింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 17,378 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది ఇంట్రాడేలో 17,429 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా హెచ్సీఎల్ టెక్నాలజీస్ 2.17 శాతం పెరిగింది. ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహింద్రా, బజాజ్ ఆటో, ఎం అండ్ ఎం, హెచ్యూఎల్లు సైతం లాభాల్లో ముగిసాయి.
అంతర్జాతీయ సంకేతాల సానుకూలత, ఐటీ, రియల్టీ షేర్లకు లభించిన మద్దతుతో మార్కెట్ ర్యాలీ కొనసాగిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే కొద్ది మార్కెట్ హెవీవెయిట్ల సాయంతో సూచీలు రికార్డుస్థాయికి చేరాయని, విస్త్రత మార్కెట్లో బలహీనత కనబడుతున్నదని జూలియస్ బేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలింద్ తెలిపారు. బీఎస్ఈ-30లో 17 షేర్లు నష్టాలతో ముగియగా, 13 మాత్రమే లాభపడ్డాయి. రంగాలవారీగా బీఎస్ఈ రియల్టీ ఇండెక్స్ 2.97 శాతం పెరగ్గా, ఐటీ ఇండెక్స్ 1.48 శాతం ఎగిసింది. ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, బ్యాంకెక్స్లు స్వల్పగా తగ్గాయి.
రిలయన్స్ రికార్డు
ముకేశ్ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కొత్త రికార్డుస్థాయికి పెరిగింది. గత శుక్రవారం రూ.2,400 సమీపంలో ముగిసిన ఆర్ఐఎల్ సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైనంతనే 4 శాతం వరకూ పెరిగి రూ.2,479 పాయింట్ల వద్ద కొత్త రికార్డును సృష్టించింది. తదుపరి లాభాల స్వీకరణ కారణంగా ఈ స్థాయి నుంచి కొంతమేర తగ్గినప్పటికీ, చివరకు 2 శాతం లాభంతో రూ.2,425 వద్ద ముగిసింది. రిలయన్స్తో పాటు ఐటీ షేర్లయిన ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ జీవితకాల గరిష్ఠస్థాయిల వద్ద ముగిసాయి.