ముంబై, జనవరి 9: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. వరుస మూడు రోజుల నష్టాలకు తెరదించుతూ అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల మధ్య మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబర్చారు. ఈ క్రమంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లతోపాటు ఐటీ రంగ సంస్థల షేర్లు ఆకట్టుకున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటం కలిసొచ్చింది. ఫలితంగా సెన్సెక్స్ 846.94 పాయింట్లు లేదా 1.41 శాతం ఎగిసి మళ్లీ 60వేల స్థాయికి చేరి 60,747.31 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 989.04 పాయింట్లు పుంజుకోవడం విశేషం. ఇక నిఫ్టీ సైతం 241.75 పాయింట్లు లేదా 1.35 శాతం ఎగబాకి 18,101.2 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్క్యాప్ 0.93 శాతం, స్మాల్క్యాప్ 0.5 శాతం పెరిగాయి.
గ్లోబల్ మార్కెట్లలో..
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఆసియాలో దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపాలోని ప్రధాన మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు కూడా లాభాల్లోనే కదలాడుతున్నాయి. శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్ల లాభాలు కలిసొచ్చాయని మార్కెట్ నిపుణులు ఈ ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. అలాగే పొరుగు దేశం చైనాలో కరోనా ఆంక్షలు వేగంగా ఎత్తివేస్తుండటం కూడా అక్కడి మార్కెట్లకు కొత్త ఊపిరిలూదుతున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలావుంటే డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం ట్రేడింగ్లో 31 పైసలు అందుకుని 82.35 వద్ద నిలిచింది. దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాలకు ఇది కూడా దోహదం చేసింది.
రూ.3.2 లక్షల కోట్లు..
భారీ లాభాల నేపథ్యంలో మదుపరుల సంపద కూడా పెద్ద ఎత్తున పెరిగింది. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే రూ.3.2 లక్షల కోట్లకుపైగా పెరగడం గమనార్హం. సెన్సెక్స్ షేర్లలో మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ షేర్ల విలువ చెప్పుకోదగ్గ రీతిలోనే ఎగిసింది. రంగాలవారీగా టెక్నాలజీ, ఐటీ, పవర్, మెటల్, ఎనర్జీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో, ఇండస్ట్రియల్ షేర్లు 2.61 శాతం నుంచి 1.13 శాతం ఎగబాకాయి.