ముంబై, జనవరి 12: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో కదలాడాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ మరోసారి 61,000 స్థాయిని అధిగమించింది. బుధవారం 533.15 పాయింట్లు లేదా 0.88 శాతం పుంజుకుని 61,150.04 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 61,218.19 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 156.60 పాయింట్లు లేదా 0.87 శాతం ఎగబాకి 18,212.35 వద్ద నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు బాగుంటాయన్న ఆశలు మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. బుధవారం టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో త్రైమాసిక ఫలితాలు రాగా, శనివారం నుంచి బ్యాంకింగ్ సంస్థల ఫలితాలు మొదలవుతాయని అంచనా. ఇక అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సైతం దేశీయ మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి. నిజానికి కరోనా కేసులు పెరుగుతున్నా.. మదుపరులు ఎలాంటి భయం లేకుండా పెట్టుబడులకే ఆసక్తి చూపడం గమనార్హం. ఈ క్రమంలోనే రియల్టీ, ఆటో, ఎనర్జీ, బ్యాంకింగ్ షేర్లు ఆకట్టుకున్నాయి. బీఎస్ఈ టెలికం, పవర్, యుటిలిటీస్, ఎనర్జీ రంగాల షేర్లు 3.15 శాతం వరకు ఎగిశాయి. 19 రంగాల సూచీల్లో కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్కేర్ మాత్రమే నష్టపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు 4.68 శాతం మేర పెరిగాయి. అయితే టీసీఎస్, టైటాన్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, నెస్లే షేర్లు 1.50 శాతం వరకు పడిపోయాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ లాభాల్లోనే ఉన్నది. ఇదిలావుంటే డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 73.93 వద్ద ఉన్నది.
స్టాక్ మార్కెట్ల వరుస లాభాల మధ్య బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో రూ.277.22 లక్షల కోట్లను దాటేసింది. గత నాలుగు రోజులుగా మార్కెట్లు లాభాల్లో కదలాడుతుండగా, బీఎస్ఈ మదుపరుల సంపద రూ.6,08,024.55 కోట్లు ఎగిసింది. ఈ క్రమంలోనే మొత్తం సంపద రూ.2,77,22,916.43 కోట్లకు చేరింది. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,548.2 పాయింట్లు పెరిగింది.