Omicron effect on Stocks | గ్లోబల్ ఎకానమీ రికవరీపై కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళన మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ను దెబ్బ తీసింది. తొలుత ఇంట్రాడేలో 900కి పైగా పాయింట్లు లాభపడిన చివరి అరగంటలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 195.71 పాయింట్ల నష్టంతో 57,064.87 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 70.75 పాయింట్లు నష్టపోయి మూడునెలల్లో తొలిసారి 17 వేల మార్క్ దిగువన 16,983.20 పాయింట్ల వద్ద స్థిర పడింది.
బీఎస్ఈ సెన్సెక్స్లో టాటా స్టీల్ 3.87 శాతం నష్టపోగా, కొటక్ బ్యాంక్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతి స్క్రిప్ట్లు పతనం అయ్యాయి. మరోవైపు పవర్ గ్రిడ్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్ట్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ తదితర స్టాక్స్ 3.43 శాతం వరకు లాభ పడ్డాయి.
బీఎస్ఈ మెటల్, ఎనర్జీ, ఆటో, బ్యాంకెక్స్, టెలికం ఇండెక్స్లు 2.34 శాతం నష్టపోగా, కన్జూమర్ డ్యూరబుల్స్, ఐటీ, రియాల్టీ, టెక్ ఇండెక్స్లు లాభపడ్డాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 1.45 శాతం దూసుకెళ్లాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్పై రూపాయి 10 పైసలు నష్టపోయి 75.17 వద్ద ముగిసింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 3.12 శాతం తగ్గి 71.15 డాలర్లకు చేరింది.