ముంబై, జూలై 8: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ లాభాల్లో ముగిశాయి. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 303.38 పాయింట్లు లేదా 0.56 శాతం పుంజుకుని 54,481.84 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 87.7 పాయింట్లు లేదా 0.54 శాతం ఎగిసి 16,220.6 వద్ద స్థిరపడింది. విదేశీ మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణలకే పెద్దపీట వేసినా.. దేశీయ మదుపరులు మాత్రం బ్యాంకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎఫ్ఎంసీజీ షేర్ల కొనుగోలుకు మొగ్గుచూపారు. ఇది సూచీలకు కలిసొచ్చింది. ఎల్అండ్టీ షేర్ అత్యధికంగా 4.72 శాతం ఎగబాకింది. పవర్గ్రిడ్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్టెల్, నెస్లే ఇండియా షేర్లూ లాభపడ్డాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ 0.28 శాతం, మిడ్క్యాప్ 0.2 శాతం చొప్పున పెరిగాయి. ఈ వారం సెన్సెక్స్ 1,573.91 పాయింట్లు లేదా 2.97 శాతం, నిఫ్టీ 468.55 పాయింట్లు లేదా 2.97 శాతం ఎగబాకాయి. బుధ, గురువారాల్లోనూ సూచీలు లాభాల్లోనే ముగియడంతో ఈ మూడు రోజుల్లో బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.6,30,479.15 కోట్లు పెరిగి రూ. 2,51,59, 998.8 కోట్లను తాకింది.
గ్లోబల్ మార్కెట్లలో..
అంతర్జాతీయంగా జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా సూచీలు లాభాల్లో ముగిశాయి. చైనా మాత్రం నష్టాలకే పరిమితమైంది. ఐరోపా దేశాల్లోనూ ప్రధాన మార్కెట్లు నష్టాల్లోనే కదలాడుతున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గురువారం అమెరికా మార్కె ట్లు లాభాల్లో ముగిసినది విదితమే. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను ప్రభావితం చేసే అమెరికా ఉద్యోగ గణాంకాలపై మదుపరులు దృష్టి పెట్టారని, అందుకే గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించిందని నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.