ముంబై, డిసెంబర్ 2: ఒమిక్రాన్ భయాలు కొనసాగుతున్నా, అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నా వరుసగా రెండో రోజు స్థానిక ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో స్టాక్ సూచీలు భారీగా పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం 776 పాయింట్లు ర్యాలీ జరిపి 58,461 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 235 పాయింట్లు జంప్చేసి 17,402 పాయింట్ల వద్ద నిలిచింది. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా హెచ్డీఎఫ్సీ 3.9 శాతం పెరిగింది. పవర్గ్రిడ్, సన్ఫార్మా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఆటోలు 2-3 శాతం మధ్య లాభపడ్డాయి. కేవలం మూడు షేర్లు…ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో ముగిసాయి. ప్రపంచ మార్కెట్లలో బలహీన సెంటిమెంట్ నెలకొన్నా, దేశీ ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ఐటీ, ఫైనాన్షియల్స్, మెటల్ షేర్లకు మద్దతు లభించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ యుటిలిటీస్, పవర్, ఐటీ, టెక్నాలజీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ఫైనాన్స్ ఇండెక్స్లు 2.2 శాతం మేర ఎగిసాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతంపైగా పెరిగాయి.
ప్రపంచ సూచీలు డీలా పడినా…
కొవిడ్-19 సందర్భంగా అమలు జరుపుతున్న ఉద్దీపనను త్వరలో క్రమేపీ తగ్గిస్తామని, వడ్డీ రేట్లను పెంచుతామంటూ అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ చైర్మన్ ప్రకటించడం, అమెరికాలో ఒమిక్రాన్ కేసులు నమోదుకావడం వంటి అంశాలతో తాజాగా ప్రపంచ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా సూచీలు వరుసగా రెండు రోజులపాటు భారీ పతనాన్ని చవిచూసాయి. దీంతో గురువారం జపాన్, చైనా, యూరప్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో అక్టోబర్ నెల వరకూ 36.6 శాతానికే పరిమితం కావడం, నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.30 లక్షల కోట్లకుపైగా నమోదుకావడం తదితర అంశాలు ఇన్వెస్టర్లను ప్రోత్సహించాయని నాయర్ వివరించారు.
రెండు రోజుల మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.5.35 లక్షల కోట్లు పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.2,62,52,791 కోట్లకు చేరింది.