Stocks | అంతర్జాతీయ మార్కెట్లలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నా, దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్ మేజర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్ దన్నుతో ఇండెక్స్లు దూసుకెళ్లాయి. డిసెంబర్ టోకు ద్రవ్యోల్బణం రెండేండ్ల కనిష్ట స్థాయి 4.9 శాతంగా నమోదు కావడం, క్రూడాయిల్, ఏవియేషన్ ఫ్యూయల్పై వైండ్ఫాల్ ట్యాక్స్పై కేంద్రం కోత విధించడంతో ఆయిల్ రిఫైనరీ స్టాక్స్ పుంజుకున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ నిఫ్టీ 158 పాయింట్లు (0.8 శాతం) లాభంతో 18,053 మార్క్ను చేరుకున్నది.
మరోవైపు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 562.75 పాయింట్లు (0.9 శాతం) లబ్ధితో 60,655.72 పాయింట్లకు చేరుకున్నది. ఇంట్రాడే ట్రేడింగ్లో సెన్సెక్స్ 611.51 పాయింట్లు పుంజుకుని 60,704.48 పాయింట్ల గరిష్టాన్ని తాకింది.
సెన్సెక్స్లో లార్సెన్ అండ్ టర్బో, హిందూస్థాన్ యూనీలివర్, హెచ్యూఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఎన్టీపీసీ భారీగా లబ్ధి పొందాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ నష్టాలతో ముగిశాయి.
నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఐటీ ఇండెక్స్లు ఒక శాతం లాభాలతో ముగిశాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు, నిఫ్టీ మీడియా ఇండెక్స్లు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్-100, నిఫ్టీ మిడ్ క్యాప్-100 ఇండెక్స్లు 0.1 శాతం చొప్పున నష్టపోయాయి. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.81.61 నుంచి రూ.81.76కు పతనమైంది.
ఆసియాలో టోక్యో స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిస్తే, సియోల్, షాంఘై, హాంకాంగ్ ఇండెక్స్లు నష్టపోయాయి. ఈయూ మార్కెట్లు మిడ్ సెషన్ డీల్స్లో నెగెటివ్గా ట్రేడయ్యాయి. ఇంటర్నేషనల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.67 శాతం పెరిగి బ్యారెల్పై 85.03 డాలర్లు పలికింది.