ముంబై, డిసెంబర్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లపై కరోనా వైరస్ పంజావిసురుతున్నది. వరుసగా మూడోరోజు సూచీలు భారీగా నష్టపోయాయి. రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలు, చైనాలో కరోనా వైరస్ మరింత విజృంభిస్తుండటం మార్కెట్లో సెంటిమెంట్ను నీరుగార్చింది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడినప్పటికీ దేశీయ సూచీలు మాత్రం నష్టాల్లోకి జారుకున్నాయి.
సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ చివరికి 61 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 241.02 పాయింట్లు నష్టపోయి 60,826.22 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 400 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ చివరకు ఈ భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 71.75 పాయింట్లు కోల్పోయి 18,127.35 వద్ద స్థిరపడింది.