ముంబై, సెప్టెంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. పలు సెంట్రల్ బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచడానికి సమయాత్తమవుతుండటంతో మదుపరుల్లో ఆందోళన తీవ్రతరమైంది. అంతర్జాతీయ మార్కెట్లు బేరీష్ ట్రెండ్ కొనసాగుతుండటంతో దలాల్స్ట్రీట్లో అమ్మకాలు పోటెత్తాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు అత్యధికంగా నష్టపోవడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 770.48 పాయింట్లు లేదా 1.29 శాతం తగ్గి 58,766.59 వద్ద స్థిరపడింది. ఒక దశలో 1,014 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ చివర్లో ఈ భారీ నష్టాలను పూడ్చుకున్నది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 216.50 పాయింట్లు(1.22 శాతం) తగ్గి 17,542.80 వద్ద ముగిసింది. ఎగుమతి చేసే డీజిల్, జెట్ ఫ్యూయల్పై విధిస్తున్న విండ్ఫుల్ ట్యాక్స్ను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రైవేట్ ఇంధన సంస్థల షేర్లపై ప్రభావం పడింది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు భారీగా పడిపోయింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2.99 శాతం తరిగిపోయి టాప్ లూజర్గా నిలిచింది
టీసీఎస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, హెచ్యూఎల్,ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి, విప్రో, కొటక్ బ్యాంక్, ఎల్అండ్టీ షేర్లు కూడా కరెక్షన్కు గురయ్యాయి.
కానీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, టైటాన్, భారతీ ఎయిర్టెల్ల షేర్లు లాభాల్లో ముగిశాయి.
30 షేర్ల ఇండెక్స్లో 23 షేర్లకు నష్టం.
రంగాలవారీగా చూస్తే ఎనర్జీ 1.99 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.77 శాతం, ఐటీ 1.68 శాతం, మెటల్ 1.56 శాతం, టెక్ 1.41 శాతం, యుటిలిటీ 1 శాతం తగ్గాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 2 శాతం తగ్గి 93.73 డాలర్ల వద్దకు జారుకున్నది.
డాలర్తో రూపాయి మారకం విలువ 4 పైసలు తగ్గి 79.56 వద్ద నిలిచింది.