Stock Market | ముంబై, ఏప్రిల్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు మరో చారిత్రక స్థాయికి చేరాయి. అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ రెండూ ఆల్టైమ్ హైల్లో ముగిశాయి. సెన్సెక్స్ తొలిసారి 75వేల మార్కు ఎగువన స్థిరపడింది. నిజానికి మంగళవారం ట్రేడింగ్లోనే మొదటిసారి 75,000 స్థాయిని సూచీ దాటింది. ఒకానొక దశలో మునుపెన్నడూ లేనివిధంగా 75,124.28కి వెళ్లింది. దీంతో ఇంట్రా-డే హై రికార్డు నమోదైంది. అయితే మదుపరుల లాభాల స్వీకరణతో చివరకు నష్టాలే మిగిలాయి. ముఖ్యంగా హెవీ వెయిట్ షేర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలో సెన్సెక్స్ 75వేల దిగువకే పరిమితమైంది. కానీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లకు పెద్దపీట వేయడంతో బుధవారం సెన్సెక్స్ 354.45 పాయింట్లు లేదా 0.47 శాతం ఎగిసి 75,038.15 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 421.44 పాయింట్లు పుంజుకొని 75,105.14 చేరినా దాన్ని నిలుపుకోలేకపోయింది. నిఫ్టీ సైతం 111.05 పాయింట్లు ఎగబాకి గతంలో ఎప్పుడూ లేనట్టుగా 22,753.80 వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో 22,775.70 స్థాయిని తాకింది. ఈ లెవల్కు సూచీ వెళ్లడం ఇదే మొదటిసారి.
ఆకట్టుకున్న ఎఫ్ఎంసీజీ, మెటల్ షేర్లు
ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, మెటల్ షేర్లు మదుపరులను అత్యధికంగా ఆకట్టుకున్నాయి. ఐటీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, రిలయన్స్, నెస్లే షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ 0.89 శాతం, స్మాల్క్యాప్ సూచీ 0.46 శాతం పెరిగాయి. చమురు-గ్యాస్ రంగ షేర్లు 1.74 శాతం, ఎనర్జీ 1.71 శాతం, మెటల్ 1.66 శాతం కమోడిటీస్ 1.30 శాతం, సర్వీసెస్ 1.15 శాతం మేర లాభపడ్డాయి.
గ్లోబల్ మార్కెట్లలో..
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ప్రధాన ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా సూచీలు నష్టపోయాయి. హాంకాంగ్ సూచీ లాభపడింది. ఎన్నికల కారణంగా దక్షిణ కొరియా మార్కెట్లు మూతబడ్డాయి. ఇక ఐరోపా మార్కెట్లలో కీలక సూచీలైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ లాభాల్లో కదలాడుతున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిసిన విషయం తెలిసిందే.
నేడు మార్కెట్లకు సెలవు
రంజాన్ పర్వదినం సందర్భంగా స్టాక్ మార్కెట్లకు గురువారం సెలవు. ఈక్విటీలతోపాటు మనీ మార్కెట్లూ మూతబడుతాయని బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం యథాతథంగా మార్కెట్లలో ట్రేడింగ్ జరుగనున్నది.
రూ.402 లక్షల కోట్లకు..
మార్కెట్ ర్యాలీతో మదుపరుల సంపద కూడా పరుగులు పెడుతున్నది. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ బుధవారం మరో 2.27 లక్షల కోట్లు పెరిగింది. స్టాక్ ఎక్సేంజ్ వివరాల ప్రకారం రూ.2,27,024.52 కోట్లు పెరిగి రూ.4,02,19,353.07 కోట్ల (4.83 ట్రిలియన్ డాలర్లు) ఆల్టైమ్ హైకి చేరింది. సోమవారం తొలిసారి బీఎస్ఈ మదుపరుల సంపద రూ.400 లక్షల కోట్ల మార్కును దాటిన సంగతి విదితమే.