ముంబై, జనవరి 8: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాదిలోనే భారీ పతనాన్ని చవిచూశాయి. సోమవారం అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ పెద్ద ఎత్తున నష్టపోయాయి. నిజానికి ఉదయం ఆరంభంలో లాభాల్లోనే నడిచినా.. ఆ తర్వాత మాత్రం నేలచూపులు చూశాయి. సమయం గడుస్తున్నకొద్దీ మరింత దిగజారాయి. ఈ క్రమంలోనే వరుస రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 670.93 పాయింట్లు లేదా 0.93 శాతం క్షీణించి 71,355.22 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 725.11 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. నిఫ్టీ సైతం 197.80 పాయింట్లు లేదా 0.91 శాతం పడిపోయి 21,513 వద్ద ముగిసింది.
ఎఫ్ఎంసీజీ షేర్లు ఢమాల్
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుకున్న బలహీన సంకేతాలతో లాభాల స్వీకరణ దిశగా నడిచిన మదుపరులు.. పలు కీలక రంగాల షేర్లను అమ్మేశారు. ఎఫ్ఎంసీజీ షేర్లు అత్యధికంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా ఈ సూచీ 1.55 శాతం పడిపోయింది. ఆ తర్వాత కమోడిటీస్ 1.44 శాతం, బ్యాంకింగ్ 1.42 శాతం, మెటల్ 1.40 శాతం, ఆర్థిక సేవలు 1.05 శాతం, టెలీ కమ్యూనికేషన్ 0.93 శాతం, ఐటీ 0.90 శాతం, టెక్నాలజీ 0.77 శాతం చొప్పున నష్టపోయాయి. దీంతో పవర్, రియల్టీ, సర్వీసెస్ రంగాల షేర్లు లాభపడినా.. సూచీలను నిలబెట్టలేకపోయాయి. ఇక షేర్లవారీగా చూస్తే.. ఎస్బీఐ, ఐటీసీ, నెస్లే, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, హెచ్యూఎల్ షేర్లు నష్టపోయాయి. మరోవైపు హెచ్సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ 0.87 శాతం, స్మాల్క్యాప్ 0.36 శాతం క్షీణించాయి.
గ్లోబల్ మార్కెట్లలో..
ఆసియా, ఐరోపా మార్కెట్లూ నష్టాల్లోనే కదలాడాయి. ఆసియాలో ప్రధానమైన దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్ సూచీలు పడిపోగా, ఐరోపాలోని బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలూ దిగజారాయి. అమెరికా మార్కెట్లు మాత్రం శుక్రవారం స్వల్పంగా పెరిగినది తెలిసిందే. విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐలు) శుక్రవారం రూ.1,696.86 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.
2.91 లక్షల కోట్లు ఆవిరి
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు వాటిల్లిన నష్టాలు.. మదుపరుల సంపదను భారీగానే ఆవిరి చేశాయి. బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే రూ.2,91, 756.23 కోట్లు తగ్గింది. దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ రూ.3,66,40,965.08 కోట్లకు పరిమితమైంది. అమెరికా బాండ్ ఈల్డ్స్ మళ్లీ 4 శాతాన్ని దాట డం.. భారతీయ ఈక్విటీ మార్కెట్లను బాగా ప్రభావితం చేసింది. ఇన్వెస్టర్లు ఒక్కసారిగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అలాగే ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతలకున్న అవకాశాలూ తగ్గడం.. మార్కెట్ సెంటిమెంట్ను ఇంకా బలహీనపర్చిందని అంటున్నారు.
నష్టాలకు కారణాలు