ముంబై, ఫిబ్రవరి 13 : దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో సూచీలు ఒక్క శాతానికి పైగా పతనం చెందాయి. మెటల్, ఐటీ, కమోడిటీ సూచీల్లో అమ్మకాలు పోటెత్తడంతోపాటు ఐటీ రంగ షేర్లు వరుసగా నాలుగో రోజు కూడా దిగువముఖం పట్టాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాలకు ఆజ్యంపోశాయి. ఇంట్రాడేలో 1,140 పాయింట్లు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 1,048.16 పాయింట్లు లేదా 1.25 శాతం పతనం చెందింది. చివరకు వారాంతం ముగిసే సమయానికి సూచీ 82,626.76 పాయింట్ల వద్ద ముగిసింది.
మరోసూచీ నిఫ్టీ కూడా కీలక మైలురాయిని కోల్పోయింది. 336.10 పాయింట్లు లేదా 1.30 శాతం తగ్గి 25,471.10 వద్ద స్థిరపడింది. దీంతో మదుపరులు రూ.7 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,02,017.71 కోట్లు కరిగిపోయి రూ.4,65,46,643.20 కోట్లు లేదా 5.13 ట్రిలియన్ డాలర్లుకు జారుకున్నది. గడిచిన రెండు సెషన్లలో మదుపరులు రూ.9.52 లక్షల కోట్ల సంపదను కోల్పోయినట్టు అయింది. కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలు, ఏఐ అంతరాయంతో టెక్నాలజీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్నాయని వెల్త్ మేనేజ్మెంట్ రీసర్చ్ హెడ్ సిద్ధార్థ తెలిపారు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 10 నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నదన్నారు.