Private Petrol Pumps Dealers |అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పైపైకి దూసుకెళ్తున్నా.. తక్కువ ధరలకు పెట్రోల్, డీజిల్ విక్రయించలేమని ప్రైవేట్ పెట్రోల్ పంపుల రిటైల్ డీలర్లు తేల్చి చెప్పారు. కేంద్ర చమురుశాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర చమురుశాఖకు జియో-బీపీ, నయారా ఎనర్జీ వంటి రిటైల్ డీలర్లతో కూడిన భారత పెట్రోలియం పరిశ్రమ సమాఖ్య (ఫిపి) ఈ నెల 10న లేఖ రాసింది. లీటర్ డీజిల్పై రూ.20-25, లీటర్ పెట్రోల్పై రూ.14-18 నష్టానికి విక్రయించాల్సి వస్తుందని డీలర్ల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే పెట్రోలియం పరిశ్రమ రిటైల్ బిజినెస్లో భవిష్యత్లో పెట్టుబడులు రావడానికి పరిమితులు ఏర్పడతాయని ఫిపి తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో దశాబ్ది గరిష్ఠ స్థాయికి క్రూడాయిల్ ధరలు పెరిగాయి. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆధ్వర్యంలోని పెట్రోల్ పంపులకే దేశీయ రిటైల్ పెట్రోల్ పంపుల బిజినెస్పై 90 శాతం పట్టు ఉంది. కేంద్ర చమురు సంస్థలు మూడింట రెండొంతుల ధర ఫ్రీజ్ చేసి విక్రయిస్తున్నాయి. జియో-బీపీ, రోస్నెఫ్ట్ సారధ్యంలోని నయారా ఎనర్జీ, షెల్ తదితర ప్రైవేట్ పెట్రోల్ పంపుల రిటైలర్లు ధరలు పెంచి గానీ, తక్కువ ధరకు అమ్మి నష్టాల బారీన గానీ పడాలి. లేదా నష్టాలను తగ్గించుకోవడానికి ప్రైవేట్ పెట్రోల్ పంపులు సేల్స్ తగ్గించుకోవాలి. ధరలు పెంచితే, కస్టమర్లు కేంద్ర చమురు సంస్థల ఆధీనంలోని పెట్రోల్ పంపులకు వెళుతున్నారని ఫిపి ఆందోళన వ్యక్తం చేసింది.
2021 నవంబర్ నుంచి 2022 మార్చి 21 మధ్య అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరిగినా రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు 137 రోజులుగా స్థిరంగా కొనసాగాయి. మార్చి 22 నుంచి 14 సార్లు సగటున 80 పైసలు చొప్పున ధరలు పెంచి విక్రయించారు. దీనివల్ల మొత్తం లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్పై రూ.10 ధర పెరిగింది. ఫలితంగా లీటర్ పెట్రోల్పై రూ.14-18, లీటర్ డీజిల్పై రూ.20-25 నష్టానికి విక్రయించాల్సి వస్తుందని ఫిపి డైరెక్టర్ జనరల్ గుర్మీత్ సింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల నష్టాలు పెరిగిపోతున్నాయన్నారు.