Pre-used Cars Market | కొవిడ్-19 తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలని భావించే వారు సొంత కారు ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, కుటుంబ అవసరాల రీత్యా కొత్త కారు కొనలేని పరిస్థితి. అటువంటి వారు సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ ప్రక్రియకు ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు అమలు చేయడం లేదు. ఇక నుంచి సెకండ్హ్యాండ్ కార్ల మార్కెట్ ప్రభుత్వ నియంత్రణలోకి రానున్నది. సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయనున్నది. సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసే వారికి పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కస్టమర్లకు ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వం రూపొందించిన తాజా నిబంధనల ప్రకారం వెహికల్స్ రీసేల్ సమాచారాన్ని డీలర్లు ప్రభుత్వంతో, రవాణాశాఖతో పంజుకోవాల్సిందే. యూజ్డ్ కార్ లేదా బైక్ రీ సేల్ చేయాలనుకున్న డీలర్ల పేర్లను.. వారి సంస్థ పేర్లను రాష్ట్ర రవాణాశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వారికి రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్ జారీ చేస్తుంది.
ఒకవేళ, సెకండ్ హ్యాండ్ కార్ల సేల్ డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఆయన సంస్థ లైసెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తుంది. రీసేల్ కోసం డీలర్ వద్దకు వచ్చిన వెహికల్ (కారు లేదా బైక్)ను సేల్ కోసం రిజిస్టర్ చేయాలి. సంబంధిత రిజిస్టర్డ్ రీసేల్ వాహనం చోరీకి గురైనా, ఇతర దురదృష్టకర ఘటన జరిగినా ఆ డీలర్దే పూర్తి బాధ్యత.
కారు పాత యజమాని చేసిన తప్పులు, ఉల్లంఘనలు కొత్త యజమానికి చుట్టుకుంటాయి. తాజాగా కేంద్రం రూపొందించిన నిబంధనల ప్రకారం పాత కారు యజమానికి, రీసేల్లో దాన్ని కొనుగోలు చేసిన కొత్త యజమానికి మధ్య సంబంధం ఉండదు. రవాణాశాఖలో సెకండ్హ్యాండ్ కారు కొత్త యజమాని వివరాలను అప్డేట్ చేయాల్సిన బాధ్యత డీలర్దే. 2020-21లో దేశవ్యాప్తంగా 35 లక్షల సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించినట్లు వార్తలొచ్చాయి. వచ్చే నాలుగేండ్లలో అంటే 2026 నాటికి సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ 70 లక్షలకు చేరుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.