న్యూఢిల్లీ, మే 20: క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ (ఐపీవోలు) లిస్టింగ్ సమయాన్ని ప్రస్తుతమున్న 6 రోజుల నుంచి 3 రోజులకు తగ్గించాలని చూస్తున్నది. ఈ మేరకు ఓ ప్రతిపాదననూ తీసుకొచ్చింది. దీంతో పబ్లిక్ ఇష్యూ తర్వాత ఆయా సంస్థల షేర్లు స్టాక్ ఎక్సేంజీల్లో ఇంకా త్వరగా నమోదు కానున్నాయి. దీనివల్ల అటు మదుపరులు, ఇటు కంపెనీలకు లాభం చేకూరగలదని సెబీ భావిస్తున్నది. ఇదిలావుంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)లు.. మార్కెట్ అవకతవకలు, మోసపూరిత లావాదేవీల నిరోధానికి నిఘా, ఇంటర్నల్ కంట్రోల్ వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలని సెబీ చెప్తున్నది. అంతేగాక ఏఎంసీల్లోని సీనియర్ మేనేజ్మెంట్.. తమ ఉద్యోగులు, డీలర్లు, స్టాక్ బ్రోకర్లు లేదా ఇతరత్రా సంబంధిత సంస్థల అక్రమాలను గుర్తించి, నివేదించే సంస్థాగత వ్యవస్థలకు బాధ్యత వహించాలనీ సూచించింది.